జింబాబ్వే పర్యటనలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన శుభ్మన్ గిల్ బృందం రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. విజయంలో యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రధాన పాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. శుభ్మన్ గిల్ (77 నాటౌట్; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్), రింకూ సింగ్ (48 నాటౌట్; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మధెవెర్ (43; 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15) చెరో మూడు వికెట్లతో విజృంభించారు.

కాగా, తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ డకౌటైన విషయం తెలిసిందే. నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయలేదు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే తన అరంగేట్ర మ్యాచ్లో డకౌటవ్వడంపై యువరాజ్ సింగ్ భిన్నంగా స్పందించాడని అభిషేక్ శర్మ తెలిపాడు. డకౌట్ అయినందుకు యువీ హ్యాపీగా ఫీల్ అయ్యాడని, ఇది మంచి ఆరంభమే అన్నాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ దగ్గర అభిషేక్ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

''తొలి మ్యాచ్ అయిపోయిన తర్వాత యువరాజ్తో మాట్లాడాను. కారణం ఏంటో తెలియదు కానీ నేను డకౌట్ అయినందుకు అతను హ్యాపీగా ఉన్నాడు. మంచి ఆరంభమే అన్నాడు. కానీ ఇప్పుడు అతను ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాడు (సెంచరీ గురించి). అతను ఫ్యామిలీతో సమానం. ఇదంతా అతని వల్లే సాధ్యం. నా ఆట మెరుగవ్వడం కోసం ఎన్నో ఏళ్లు తీవ్రంగా శ్రమించాడు. కేవలం మైదానంలో కాదు, మిగిలిన విషయాల్లోనూ నాపై ప్రేమ చూపించేవాడు'' అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు.