
జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజా ఇండియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో అసామాన్య పోరాటాన్ని కనబర్చిన సంగతి తెలిసిందే. ఓడిపోయినప్పటికీ తమ జట్టు ప్రయత్నాన్ని అతను మెచ్చుకున్నాడు. తన అధికారిక ట్విట్టర్లో సికందర్ రజా తన సెంచరీకి సంబంధించిన కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. 'మేం దాదాపు దరిచేరినా.. దరిదాపుల్లో లేము' అని క్యాప్షన్ ఇచ్చాడు. దీని బట్టి.. టీమిండియాపై గెలిచే అవకాశం వచ్చినా.. ఆ జట్టుపై గెలవడానికి మా ప్రయత్నం ఏమాత్రం సరిపోదు అన్నట్లు రజా పేర్కొన్నాడు. 'అలాగే గెలుపునకు ఇంత దగ్గరగా వచ్చి..మరియు గెలుపు గీతను దాటకపోతే అది చాలా బాధిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మా జింబాబ్వేకు ఇండియా టీం రావడం చాలా బాగుంది.. ఇప్పుడు మేం ఆస్ట్రేలియాకు వెళ్లే సమయం వచ్చింది. నన్ను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు.. నేను ఎప్పటికీ మీ పట్ల కృతజ్ఞుడను.' అని రజా పేర్కొన్నాడు.
తొలుత గిల్ సెంచరీ చేయడంతో ఇండియా 289పరుగుల స్కోరు చేయగలిగింది. ఇక 290 పరుగుల ఛేదనలో జింబాబ్వే ఏం తక్కువ తినలేదు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సికందర్ రజా (115పరుగులు 95బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. రజా కడవరకు నిలిచి ఉంటే జింబాబ్వేకు విజయాన్ని అందించేవాడేమోననిపించింది. కానీ అతను శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో లాంగాఫ్లో ఓ షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద ఉన్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ వల్లే చివర్లో ఇండియాకు మ్యాచ్ దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే రజా అప్పటికే మంచి టచ్లో ఉన్నాడు. ఇక రజా ఔటయ్యాక.. జింబాబ్వే 13పరుగుల తేడాతో ఓడిపోయింది.