జింబాబ్వే పర్యటనలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమిండియా రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను శుభ్మన్ గిల్ బృందం చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్షోతో సత్తాచాటింది. అయితే విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ను స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కొనియాడాడు.
తన రెండో టీ20లోనే 46 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులు బద్దలుకొట్టిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసలు జల్లు కురిపించాడు. గేమ్ ఛేంజర్ అంటూ కొనియాడాడు. 'అభిషేక్ శర్మ వావ్ అనిపించేలా బ్యాటింగ్ చేశాడు. గేమ్ ఛేంజర్' అని సూర్య ట్వీట్ చేశాడు. తొలి టీ20లో డకౌటైన అభిషేక్ రెండో మ్యాచ్లో శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

వన్డౌన్లో వచ్చి క్రమంగా గేర్ మార్చి సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్ను కూడా సూర్య కొనియాడాడు. స్వచ్ఛమైన క్లాస్తో బ్యాటింగ్ చేశావని అన్నాడు. 47 బంతుల్లో రుతురాజ్ అజేయంగా 77 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. అంతేగాక అభిషేక్తో కలిసి రెండో వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక రింకూ సింగ్తో కలిసి మూడో వికెట్కు అభేద్యమైన 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ఇన్నింగ్స్కు ఇరుసులా మారాడు.
ఫినిషర్గా సత్తాచాటిన రింకూ సింగ్ను సూర్య 'గాడ్స్ ప్లాన్ రింకూ' అంటూ ట్రోల్ చేస్తూ మెచ్చుకున్నాడు. యశ్ దయాల్ను ప్రశంసిస్తూ రింకూ సింగ్ ఓ సందర్భంలో గాడ్స్ ప్లాన్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. యశ్ దయాల్ బౌలింగ్లో రింకూ అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత యశ్ దయాల్ గొప్పగా పుంజుకుని బౌలింగ్లో మెరుగయ్యాడు.
సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీని కట్టడిచేసి జట్టును గెలిపించేంతలా స్టార్ అయ్యాడు. ఆ సమయంలో యశ్ దయాల్ను కొనియాడుతూ రింకూ గాడ్స్ ప్లాన్ అన్నాడు. ఇప్పుడు అదే డైలాగ్తో రింకూను సూర్య సరదాగా ట్రోల్ చేస్తున్నాడు. రింకూ తొలి టీ20లో డకౌటైన విషయం తెలిసిందే. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.