టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. అయిదు టీ20ల సిరీస్లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఓటమితో శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు కోరుకోని రికార్డులను మూటగట్టుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్; 25 బంతుల్లో 4×4) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (4/13) నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ (2/11) రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేకు ముకేశ్ కుమార్ ఆదిలోనే షేక్ ఇచ్చాడు. ఓపెనర్ ఇనోసెంట్ కైయాను డకౌట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన బెనెట్ (22; 15 బంతుల్లో, 5 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ మద్వీర (21; 22 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.

కానీ భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి జింబాబ్వేను 90/9 స్కోరుతో చేశారు. అయితే ఆఖరి వికెట్కు మడాండే (29 నాటౌట్, 25 బంతుల్లో, 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (31; 29 బంతుల్లో, 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (27; 34 బంతుల్లో; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఎవరూ సత్తాచాటలేదు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (3/25), చటార (3/16) మూడు వికెట్లతో సత్తాచాటారు.

అయితే ఈ క్రమంలో టీమిండియా కోరుకోని రికార్డులు నమోదుచేసింది. టీ20ల్లో ప్రత్యర్థి తొమ్మిదో వికెట్ 100 పరుగుల లోపు పడగొట్టి కూడా ఓటమి పాలైన మొదటి పూర్తి సభ్య జట్టుగా భారత్ అపకీర్తి మూటగట్టుకుంది. ఇక భారత్పై ప్రత్యర్థి విజయవంతంగా డిఫెండ్ చేసిన స్కోర్లలో ఇదే అత్యల్పం. అంతకుముందు 2016లో న్యూజిలాండ్ 126 పరుగులే చేసి గెలిచింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసింది. టీ20ల్లో భారత్కు ఇది అయిదో అత్యల్ప స్కోరు. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత తక్కువ స్కోరు. జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమితో టీ20ల్లో భారత్ వరుస 12 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది.