జింబాబ్వే పర్యటనలో భారత్ మరో మ్యాచ్కు సిద్ధమైంది. హరారే వేదికగా ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు గొప్పగా పుంజుకుని 2-1తో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరులో ఆఖరి టీ20 మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు తొలి టీ20లో గెలిచి అనంతరం ఢీలా పడిన జింబాబ్వే సొంతగడ్డపై తిరిగి సత్తాచాటాలని చూస్తోంది. ఇవాళ మ్యాచ్ గెలిచి భారత్ ఆధిక్యాన్ని సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా, టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్తో తుషార్ దేశ్పాండే అరంగేట్రం చేయనున్నాడు. అవేశ్ ఖాన్ స్థానంలో తుషార్ జట్టులోకి వచ్చాడు.

పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని భావించి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నామని గిల్ అన్నాడు. డెత్ బౌలింగ్ మెరుగుపర్చుకోవాలనే ఉద్దేశంతో తుది జట్టులోకి తుషార్ను తీసుకొచ్చామని తెలిపాడు. ''మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ తాజాగా కనిపిస్తోంది. డెత్ బౌలింగ్లో మేం మెరుగవ్వాలి. గత మ్యాచ్లో మేం నిరాశపరిచాం. తుషార్ దేశ్పాండే అరంగేట్రం చేయనున్నాడు. అవేవ్ ఖాన్ స్థానంలో తుషార్ వచ్చాడు'' అని గిల్ పేర్కొన్నాడు.
మరోవైపు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మాట్లాడుతూ టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగే ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. ఆడే కొద్ది వికెట్ స్లో అవుతుందని అంచనా వేస్తున్నామని అన్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని జట్టును సిద్ధం చేస్తున్నామని అన్నాడు. టాప్ ఆర్డర్ సత్తాచాటుతుందని ఆశిస్తున్నట్లు సికిందర్ తెలిపాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించడానికి ప్రయత్నిస్తామని అన్నాడు.
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: వెస్స్లీ మధెవెరె, మరుమని, బ్రియన్ బెన్నెట్, సికిందర్ రాజా(కెప్టెన్), డియాన్ మేయర్స్, జోహ్నాథన్ కాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదండే, రిచర్డ్, బ్లెస్సింగ్ ముజర్బానీ, తెండాయ్ ఛత్రా