జింబాబ్వేతో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. హరారే వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా పది వికెట్లతో ఘన విజయం సాధించింది. యశస్వీ జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్), శుభ్మన్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించడంతో.. 153 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
జైస్వాల్ ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుభ్మన్ గిల్ కూడా సహకరించడంతో భారత్ 3.5 ఓవర్లలోనే భారత్ 50 పరుగుల మార్క్ను అందుకుంది. ఆ తర్వాత మధ్యలో కాస్త నెమ్మదించినా కాసేపటికే జోరు అందుకున్నారు. 9.4 ఓవర్లలోపే 100 పరుగులు సాధించిన యువ ఓపెనర్లు పోటాపోటీగా ఆడుతూ మ్యాచ్ను తొందరగా ముగించారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు మరుమని (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు), వెస్లీ మధెవెరె (25; 24 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, సుందర్, తుషార్ తలో వికెట్ తీశారు.
అయితే ఓపెనర్ మరుమనిని పెవిలియన్కు చేర్చి అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ సాధించిన అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఓ టీ20 సిరీస్లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్గా చరిత్రకెక్కాడు. రెండో టీ20లో అభిషేక్ శతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కాగా, ఓ సిరీస్లో సెంచరీ + వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు.