రెండో వికెట్కు 246 పరుగులు జోడించిన కోహ్లీ-రోహిత్
ఈ మ్యాచ్లో కోహ్లీ-రోహిత్ల జోడీ రెండో వికెట్కు 246 పరుగులు జోడించడం విశేషం. ఛేదనలో ఏ వికెట్కైనా భారత్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఔట్ చేసేందుకు వెస్టిండిస్ కెప్టెన్ బౌలర్లని మారుస్తూ తీవ్రంగా శ్రమించినా.. మ్యాచ్ చేజారిపోయే వరకూ ఫలితం రాబట్టలేకపోయాడు.
రవీంద్ర జడేజా మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ "వారిద్దరూ క్రీజులో కుదురుకుంటే.. ఔట్ చేయడం చాలా కష్టం. బంతిని ఫీల్డర్ల మధ్యలో నుంచి బౌండరీకి తరలిస్తూనే.. వీలుచిక్కినప్పుడల్లా నేరుగా గాల్లోనే స్టాండ్స్లోకి పంపిస్తారు. అలాంటి బ్యాట్స్మెన్స్ని సులువుగా బోల్తా కొట్టించలేం. వాళ్లు బౌలర్లకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా.. చక్కటి షాట్లు ఆడతారు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేస్తారు" అని అన్నాడు.
323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే
వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(4) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ
ఒకవైపు రోహిత్ శర్మ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా కెరీర్లో 20వ సెంచరీ నమోదు చేశాడు.
కోహ్లీ, రోహిత్లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు
84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్ తరపున గంగూలీ, టెండూల్కర్ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్లో స్టంపౌట్ కావడంతో రెండో వికెట్కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్) రోహిత్కు అండగా నిలవడంతో భారత్ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్లు తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.