హైదరాబాద్: విశాఖపట్నానికి అనుకోని ఆతిథ్యం దక్కింది. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్డేకి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం సాయంత్రం ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది.
విండిస్తో రెండు టెస్టు మ్యాచ్ల అనంతరం ఐదు వన్డేల సిరిస్ ఆ తర్వాత మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా అక్టోబర్ 24న జరగాల్సిన రెండో వన్డేని వైజాగ్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాంప్లిమెంటరీ టికెట్ల రగడ ఎంతకీ తెగకపోవడంతో ఇండోర్ ఆతిథ్య హక్కులను వదులుకుంది.
బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియంలో 90 శాతం టికెట్లను అమ్మకానికి పెట్టాలి. 10 శాతాన్ని కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చేకునే అవకాశం ఆయా రాష్ట్ర సంఘాలకు ఉంటుంది. అయితే అంతకుమించి కావాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) డిమాండ్ చేస్తోంది.
ఇండోర్ హోల్కర్ స్టేడియం సామర్థ్యం 27,000. అందులో 10 శాతం అంటే.. 2700 కాంప్లిమెంటరీ పాస్లే ఎంపీసీఏకు మిగులుతాయి. ఇందులో సింహభాగం కాంప్లిమెంటరీ పాస్లను తమ స్పాన్సర్లకోసం బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ససేమేరా అంది.
మరోవైపు పెవిలియన్ గ్యాలరీలో ఏడువేల సీట్లే ఉన్నాయి. అందులో పది శాతం సీట్లు అంటే 700 సీట్లే. అందులో సగం బీసీసీఐకి ఇస్తే మాకు మిగిలేది 350 సీట్లు మాత్రమే. ఇది మాకు కుదరదని ఎంసీఏ జాయింట్ సెక్రటరీ తెలిపారు. దీంతో మ్యాచ్ వేదికను మార్చుకోవాలని బోర్డుకు లేఖ రాశారు.
దీంతో రెండో వన్డే ఆతిథ్యం కట్టబెడితే నిర్వహించేందుకు సిద్ధమా? అని బోర్డుతో పాటు సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సంఘాన్ని కోరగా అందుకు సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేని ఇండోర్ నుంచి విశాఖకు తరలిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్లో పేర్కొంది.
UPDATE: Second Paytm ODI against Windies shifted to Visakhapatnam #INDvWI
— BCCI (@BCCI) October 3, 2018
Full details here 👉👉👉 https://t.co/hehwdLc5JW pic.twitter.com/fdxsxuZr8d