మణికట్టు స్పిన్నర్లు మాయ చేస్తారు:
డే/నైట్ సందర్భంగా తాజాగా హర్భజన్ మాట్లాడాడు. 'గులాబి బంతి మణికట్టు స్పిన్నర్లకు ప్రయోజనకరం. స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ముందు బంగ్లాదేశ్ టీమిండియా పేసర్లను ఎదుర్కోవాలి. కోల్కతాలో సూర్యాస్తమయ సమయం 3:30-4:30 మధ్య సీమర్లు ప్రత్యర్థిని ఆటాడుకుంటారు. భవిష్యత్తు డే/నైట్ మ్యాచ్లను దృష్టిలో పెట్టుకొని స్పిన్నర్ల గురించీ ఆలోచించాలి' అని అన్నాడు.
ఫింగర్ స్పిన్నర్లకు ఇబ్బందే:
'కుల్దీప్ ఎంపిక కోచ్, కెప్టెన్ ఇష్టం. అయితే 2016 దులీప్ ట్రోఫీలో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. ఆ టోర్నీలో లెగ్ స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు. మురళీధరన్ లాంటి స్పిన్నర్లు గులాబి బంతితోనూ రాణించగలరు. కోల్కతాలో మంచు కురుస్తుంది. గులాబి బంతికి అదనపు పైపూత ఉంటుంది కాబట్టి ఫర్వాలేదు. అయితే సీమ్ కుట్ల వద్ద మాత్రం తడిగా ఉండటం ఫింగర్ స్పిన్నర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది' అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
దుర్భేద్యమైన బౌలింగ్:
ప్రస్తుతం టీమిండియాకు పరిపూర్ణ బౌలింగ్ విభాగం ఉందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారన్నాడు. 'అన్ని జట్లను గమనిస్తే కొన్ని జట్లకు నాణ్యమైన పేస్ దాడి మాత్రమే ఉంది. కొన్నింట్లో మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు. టీమిండియాకు మాత్రం ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉన్నారు' అని గంభీర్ పేర్కొన్నాడు.
అందుకే ఆలౌట్లు చేయగలుగుతోంది:
'ప్రస్తుతం జట్టులో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లేరు. వీరితో కుల్దీప్ జతకలిస్తే కోహ్లీసేనకు ఐదుగురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. మొత్తానికి 8 మంది బౌలర్లు ఉన్నారు. అందరూ ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగలరు. అందుకే రెండేళ్లుగా టీమిండియా ఎక్కువగా ఆలౌట్లు చేయగలుగుతోంది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.