
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 311పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షాయ్ హోప్ (115పరుగులు 130బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) తన వందో వన్డే మ్యాచ్లో సెంచరీతో చెలరేగడంతో ఇండియా ముందు విండీస్ భారీ టార్గెట్ ఉంచగలిగింది. ఓపెనర్గా 45 ఇన్నింగ్స్లలో 11సెంచరీలు, 10హాఫ్ సెంచరీలు చేసిన హోప్.. వన్డే క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఇక అతనితో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (74పరుగులు 77బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లు) చెలరేగాడు. ఇక భారత బౌలర్లలో షార్దూల్ ఠాకూర్ 3, దీపక్ హుడా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ 1వవికెట్ తీశారు. 312పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందో లేదో మరీ.
అదిరిన ఆరంభం
ఇక విండీస్కు ఓపెనర్లు కైల్ మేయర్స్, షాయ్ హోప్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ 9ఓవర్లు పూర్తయ్యేసరికి 65పరుగులు జోడించారు. పేసర్ల బౌలింగ్ను ఈజీగా ఎదుర్కొన్న వీరిద్దరూ స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ పవర్ ప్లేను పూర్తిగా ఉపయోగించుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ అందుకున్న దీపక్ హుడా వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేకులేశాడు. తొలి బంతికే మేయర్స్ (39పరుగులు 23బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్)ను కాట్ అండ్ బౌల్డ్గా అవుట్ చేశాడు.
కెప్టెన్ తోడుగా హోప్ నిలవగా..
తర్వాత క్రీజులోకి వచ్చిన షమరా బ్రూక్స్ షాయ్ హోప్తో కలిసి రెండో వికెట్కు 62పరుగులు జోడించాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్లో బ్రూక్స్ (35పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు) స్లిప్లో ధావన్కు దొరికిపోయాడు. బ్రాండన్ కింగ్ను చాహల్ డకౌట్ చేశాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షాయ్ హోప్ మొండిగా క్రీజులో నిలబడ్డాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ నికోలస్ పూరన్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. 30వ ఓవర్లకు వెస్టిండీస్ 3వికెట్లు కోల్పోయి 165పరుగుల స్కోరు చేసింది.
ఆకాశమే హద్దుగా పూరన్
ఇక క్రీజులో కుదురుకున్న పూరన్ ఇక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో సిక్సుల మీద సిక్సులు బాదుతూ స్టేడియంలోని ప్రేక్షకులను అలరించాడు. చాహల్ బౌలింగ్లో మూడు సిక్సులు కొట్టి వాహ్వా అనిపించాడు. అలాగే షాయ్ హోప్ సైతం 45వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. సిక్సుతోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హోప్.. సిక్స్తోనే తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. తద్వారా వందో మ్యాచ్లో సెంచరీ చేసిన 10వ బ్యాటర్గా హోప్ నిలిచాడు. ఇక ధాటిగా ఆడే క్రమంలో పూరన్ ఔటయ్యాడు. దీంతో 117పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఇక చివర్లో పావెల్ (14పరుగులు 1ఫోర్, 1సిక్స్) తన హిట్టింగ్ కొనసాగించలేకపోయాడు. హోప్ కూడా 49వ ఓవర్లో ఔటయ్యాడు. దీంతో స్కోరు బోర్డు 311పరుగులకు పరిమితమైంది.
తుది జట్లు :
భారత ప్లేయింగ్ XI: 1.శిఖర్ ధావన్ (కెప్టెన్), 2.శుభ్మన్ గిల్, 3 శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.సంజు శాంసన్ (వికెట్ కీపర్), 6.దీపక్ హుడా, 7.అక్షర్ పటేల్, 8.శార్దూల్ ఠాకూర్, 9.మహ్మద్ సిరాజ్, 10.చాహల్, 11.అవేష్ ఖాన్.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: 1.షాయ్ హోప్ (వికెట్ కీపర్), 2.కైల్ మేయర్స్, 3.షమర్ బ్రూక్స్, 4.బ్రాండన్ కింగ్, 5.నికోలస్ పూరన్ (కెప్టెన్), 6.రోవ్మాన్ పావెల్, 7.రొమారియో షెపర్డ్, 8.అకేల్ హోసేన్, 9.హేడెన్ వాల్ష్, 10.అల్జారీ జోసెఫ్, 11.జేడెన్ సీల్స్.