
ట్రినిడాడ్లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో జూలై 29న భారత్తో జరిగిన మొదటి టీ20లో వెస్టిండీస్ బౌలింగ్ టైంలో స్లో ఓవర్ రేట్కు గురయింది. తద్వారా ఆ జట్టుకు మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాను ఐసీసీ విధించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం ఈ విషయమై మీడియా ప్రకటన కూడా విడుదల చేసింది. నిర్ణీత టైంలో బౌలింగ్ కంప్లీట్ చేయకుండా.. ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు కరేబియన్ ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ ఆంక్షలు విధించారు. ఇద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లు నిగెల్ డుగుయిడ్, లెస్లీ రీఫర్లు ఈ మేరకు స్లో ఓవర్ రేట్ అభియోగాలు మోపారు. ఇక తమ నేరాన్ని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే జట్టుకు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ప్రకారం... ఓ జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. అదనంగా ప్రతి ఓవర్కు వారి మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా పడుతుంది. అందువల్ల వెస్టిండీస్ జట్టు ప్లేయర్లందరికీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పడనుంది. ఇకపోతే వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయిన వెస్టిండీస్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోని తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్లో 67పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్లో 0-1తో వెనకబడింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ, డీకే చెలరేగడంతో 190పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో కరేబియన్ జట్టు 8 వికెట్లకు 122పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. వారి బ్యాటర్లలో షమర్ బ్రూక్స్ 20పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు. సెయింట్ కిట్స్లోని బస్సెటర్లోని వార్నర్ పార్క్లో సోమవారం ఆగస్టు 1న రెండో టీ20 జరగనుంది.