హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా టీమిండియా మరో మ్యాచ్కి సన్నద్దమైంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. అయితే, ఈ ప్రపంచకప్లో అనేక మ్యాచ్లు వర్షార్పణమైన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్తో జరిగే మ్యాచ్కు కూడా వరుణుడు అంతరాయం కలిగిస్తాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, భారత్-వెస్టిండిస్ మ్యాచ్కి వర్షం ముప్పు లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణం పొడిగా ఉందని, వర్షం పడటానికి అవకాశం లేదని పేర్కొంది. అయితే, 10 శాతం వర్షం పడే సూచన ఉందని తెలిపింది. ఈ ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట విజయం సాధించి 9 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ప్రపంచకప్లో నాలుగు మ్యాచ్లు ఇప్పటికే వర్షార్పణమయ్యాయి. మరోవైపు టీమిండియాతో జరగనున్న మ్యాచ్ వెస్టిండిస్ జట్టు ఎంతో కీలకం. సెమీస్ బరిలో నిలవాలంటే వెస్టిండిస్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి.
న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో కార్లోస్ బ్రాత్వైట్ సెంచరీతో రాణించిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మోకాలి గాయంతో విండిస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రస్సెల్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడి స్థానంలో సెలక్టర్లు సునీల్ ఆంబ్రోస్ను ఎంపిక చేశారు.
ఆండ్రీ రస్సెల్ స్థానాన్ని సునీల్ ఆంబ్రోస్తో భర్తీ చేసినట్లు ఐసీసీ టెక్నికల్ కమిటీ సైతం ధృవీకరించింది. ఇక, సెమీస్ బెర్తును ఖరారు చేసుకునేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో ఉంది.