
సైనీ మాయ:
ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టీమిండియా యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జాన్ కాంప్బెల్ (0)ను ఔట్ చేశాడు. మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. పూరన్ (20), హెట్మైర్ (0)ను నవదీప్ సైనీ ఔట్ చేసాడు. రావ్మన్ పావెల్ (4)ను ఖలీల్ ఔట్ చేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ 33/5తో నిలిచింది.

పొలార్డ్ ఒక్కడే:
స్పిన్నర్లు జడేజా, కృనాల్ల బౌలింగ్లో పొలార్డ్ సిక్స్లు బాది స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ నెమ్మదిగా ఆడాడు. ఈ సమయంలో బ్రాత్వైట్, నరైన్లను కృనాల్, జడేజా ఔట్ చేశారు. పొలార్డ్ మరో రెండు సిక్స్లు బాది మరిన్ని పరుగులు జోడించాడు. సైనీ (3/17) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

తడబడ్డా నిలబడ్డారు:
లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్ కూడా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) త్వరగానే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (24; 25 బంతుల్లో 2x4, 2x6), విరాట్ కోహ్లీ (19; 29 బంతుల్లో 1x4) నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ ఔటయ్యాక భారత్ వరసగా వికెట్లు కోల్పోయినా.. మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు) అవసరమైన పరుగులు చేశారు. చివరలో రవీంద్ర జడేజా (10), వాషింగ్టన్ సుందర్ (8)లు లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది.


Click it and Unblock the Notifications












