మూడు ఫార్మాట్లు కలిపి
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు.
గురువారం విండిస్తో మ్యాచ్
టోర్నీలో భాగంగా టీమిండియా గురువారం వెస్టిండిస్తో తలపడనుంది. ఈ మ్యాచ్కి ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అధిగమిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విండిస్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ ఈ రికార్డు సాధిస్తే, ఈ ఘనతను సాధించిన 12వ క్రికెటర్గా నిలుస్తాడు.
మూడో భారత క్రికెటర్గా కోహ్లీ
ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ అరుదైన గుర్తింపు పొందుతాడు. కోహ్లీకి ముందు సచిన్ టెండూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్ల(24,208)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, 20వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్, లారాలకు 453 ఇన్నింగ్స్లు అవసరం కాగా, రికీ పాంటింగ్కు 468 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.
416 ఇన్నింగ్స్ల్లోనే
అయితే, విరాట్ కోహ్లీ 416 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ సెంచరీ సాధిస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.