
సరైన సన్నద్ధత లేకపోవడమే
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో, ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్లో భారత జట్టు సిరీస్లు ఓడిపోవడానికి సరైన సన్నద్ధత లేకపోవడమే కారణమని తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆసీస్ పర్యటనలో భాగంగా వార్మప్ మ్యాచ్లు కూడా పెంచాలని బీసీసీఐ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది.

జట్టుకు మరింత మేలు జరుగుతుందని
అంతకముందే వెస్టిండిస్ సిరీస్లో పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటే.. జట్టుకు మరింత మేలు జరుగుతుందని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే విండీస్తో సిరీస్ కోసం బౌన్సీ పిచ్లను తయారు చేయాలని కోరుతోంది. ఈ విషయమై కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల విన్నపం మేరకు బీసీసీఐ ఇద్దరు క్యురేటర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.

స్థానిక క్యురేటర్లకు సహకరించేందుకు
గత కొన్నేళ్లుగా భారత్లో మ్యాచ్ ఎక్కడ జరిగినా పిచ్ ఏర్పాటులో స్థానిక క్యురేటర్లకు సహకరించేందుకు బీసీసీఐ తమ క్యురేటర్లను ప్రత్యేకంగా ఆ వేదిక వద్దకు పంపిస్తోంది. ఇప్పుడు కూడా బీసీసీఐ చీఫ్ క్యురేటర్తో పాటు విశ్వజిత్ పాడ్యార్ ఇప్పటికే తొలి టెస్టు వేదికైన రాజ్కోట్ మైదానానికి చేరుకుని పిచ్ తయారీని పర్యవేక్షిస్తున్నారు.

బోర్డు ప్రత్యేకంగా క్యురేటర్ను పంపడంపై
రెండో టెస్టు మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం కూడా వీరి చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు తమ సొంత అసోసియేషన్ క్యురేటర్లు ఎలాంటి పిచ్లు తయారు చేసేందుకైనా సమర్థులని, బోర్డు ప్రత్యేకంగా క్యురేటర్ను పంపడాన్ని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిరంజన్ షా తప్పు పట్టారు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 4-8 తేదీల మధ్య రాజ్కోట్లో, రెండో టెస్టు 12-16 తేదీల మధ్య హైదరాబాద్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications












