|
ఆరంభంలోనే దెబ్బకొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ
భారత్ విసిరిన 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. విండీస్ స్కోర్ 32 పరుగుల వద్ద ఉండగా 18 పరుగులు చేసిన ఓపెనర్ బ్రాండన్ కింగ్ను ఔట్ చేసి ప్రసిద్ధ్ కృష్ణ తొలి వికెట్ తీశారు. ఆ వెంటనే మరో సారి చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ.. బ్రావోను ఒక్క పరుగుకే ఫెమిలియన్ చేర్చాడు. దీంతో వెస్టిండీస్ 9.1 ఓవర్లలో 38 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆరంభంలోనే విండీస్ను ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బ కొట్టినట్టయింది.
|
76కే సగం వికెట్లు
ఆ తర్వాత జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద ఉండగా 27 పరుగులు చేసిన షాయి హోప్ను 3వ వికెట్గా చాహల్ ఫెమిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి చెలరేగాడు. 9 పరుగులు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ను ఔట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పూరన్ ఔటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 66 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో విండీస్ను ఆదుకున్న జేసన్ హోల్డర్ను కేవలం 2 పరుగులకే శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
|
భాగస్వామ్యాన్ని విడదీసిన దీపక్ హుడా
షమర్ బ్రూక్స్, అకేల్ హోసేన్ విండీస్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఏడో వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 44 పరుగులు చేసిన షమర్ బ్రూక్స్ను దీపక్ హుడా ఆరో వికెట్గా ఔట్ చేశాడు. దీంతో భాగస్వామ్యానికి తెరపడింది. ఇంటర్నేషనల్ కెరీర్లో హుడాకు ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఫాబియన్ అలెన్తో కలిసి అకేల్ హోసేన్ కాసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో విండీస్ స్కోర్ 159 పరుగుల వద్ద ఉండగా 13 పరుగులు చేసిన ఫాబియన్ అలెన్ను సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్లో అలెన్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విండీస్ 159 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అదే స్కోర్ వద్ద 34 పరుగులు చేసిన అకేల్ హూసేన్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విండీస్ 159 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది.
|
సిరీస్ భారత్ కైవసం
ఈ క్రమంలో ఒడియన్ స్మిత్ కాసేపు పోరాడాడు. జోసెఫ్తో కలిసి తొమ్మిదో వికెట్కు 34 పరుగులు జోడించాడు. అయితే 24 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే అది క్యాచ్ రూపంలో వెళ్లడంతో బౌండరీ లైన్ వద్ద ఉన్న విరాట్ కోహ్లీకి చిక్కాడు. దీంతో విండీస్ 193 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే రోచ్ను ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ చేశాడు. దీంతో విండీస్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్పై టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డే మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్లలో 12 మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. ఏకంగా 3 మెయిడిన్ ఓవర్లు వేశాడు. శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, యజుర్వేంద్ర చాహల్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
|
భారత్ స్కోర్ 238
అంతకుముందు టీమిండియా నిర్ణీయ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ (64)తోరాణించాడు. రాహుల్ 49 పరుగులతో సహకరించాడు. దీపక్ హుడ్ 29, వాషింగ్టన్ సుందర్ 24, కోహ్లీ 18, పంత్ 18, చాహల్ 11*, ఠాకూర్ 8, రోహిత్ 5, సిరాజ్ 3 పరుగులు చేశారు. ఇక విండీస్ బౌలర్లలో జోసెఫ్, స్మిత్ రెండేసి.. రోచ్, అకేల్ హూసేన్, ఫైబిన్, హోల్డర్ తలో వికెట్ తీశారు.