
వాయిదా ఎందుకంటే..
మరో 3 రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వాయిదా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పరిశీలిస్తే టీమిండియాలో భారీగా కరోనా కేసులు నమోదవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లతోసహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో నేడు మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాలను బట్టి వన్డే సిరీస్ను యథావిధంగా నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా? అనే అంశంపై బీసీసీఐ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 9, 11వ తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్ జరగాల్సి ఉంది.

ఏడుగురికి పాజిటివ్
రోజువారి కరోనా పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఏడుగురు టీమిండియా సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టాండ్బై ప్లేయర్ నవదీప్ సైనీకి కరోనా సోకింది. అలాగే మరో ముగ్గురు జట్టు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
కరోనా బారిన పడిన జట్టు సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ బి. లోకేష్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్కు మొదటి రౌండ్ ఫలితాలలో నెగెటివ్గా వచ్చినప్పటికీ మూడో రౌండ్ ఫలితంలో మాత్రం పాజిటివ్గా తేలింది.

జట్టులోకి మయాంక్
ప్రస్తుతం ఉన్న టీమిండియాలోని ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో జట్టులోకి కొత్తగా మయాంక్ అగర్వాల్ను చేర్చారు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో రెగ్యూలర్ ఆటగాడిగా ఉన్న మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు.

గతంలోనూ కరోనా కలకలం
టీమిండియాలో కరోనా కలకలం రేగడం ఇది తొలిసారి ఏం కాదు. 2021 ఇంగ్లండ్ పర్యటనలో కూడా టీమిండియాలోని పలువురు సభ్యులు కరోనా బారిన పడ్డారు. పర్యటన ఆరంభంలోనే రిషబ్ పంత్కు కరోనా సోకింది. ఇక ఆ పర్యటనలో చివరి టెస్ట్ మ్యాచ్కు మందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా పలువురు సహాయక సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో ఆ మ్యాచ్ వాయిదా పడింది. అప్పుడు వాయిదా పడిన వన్డే మ్యాచ్ను ఈ ఏడాది నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications












