
కోల్కతా: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో అంపైర్ల పని తీరుపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలను భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలను పోలుస్తున్నారు. ఈ రెండు మ్యాచ్ల్లో అంపైర్ల పని తీరును పోలుస్తూ భారత్, వెస్టిండీస్ మ్యాచ్లో అంపైరింగ్ చేసిన అంపైర్లపై విమర్శలు చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే బుధవారం ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య సిడ్నీ వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంక క్రికెట్ జట్టు నిర్ణీత సమయంలోగా 19 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో అంపైర్లు చివరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ వెలుపలికి నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిచ్చారు. కాగా చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నలుగురు శ్రీలంక ఫీల్డర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశారు. ఇది బ్యాటర్లకు కలిసొచ్చే అంశం. ఐసీసీ ఇటీవల కొత్తగా తెచ్చిన రూల్స్ ప్రకారమే అంపైర్లు తమ బాధ్యతను నిర్వర్తించారు. దీంతో ఐసీసీ కొత్త నిబంధనకు గురైన తొలి టీంగా శ్రీలంక నిలిచింది. ఐసీసీ ఇటీవల తెచ్చిన నిబంధనల ప్రకారం బౌలింగ్ జట్టు నిర్ణీత సమయంలోగా తమ కోటా పూర్తి చేయకుంటే చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది.
బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య కోల్కతా వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ను పూర్తి చేయలేకపోయింది. 20 ఓవర్లు పూర్తి చేయడానికి ఏకంగా గంట 58 నిముషాల సమయం తీసుకుంది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం చివరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ వెలుపలికి నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించాలి. కానీ అంపైర్లు అది చేయలేదు. అసలు టీమిండియా బౌలింగ్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న విషయాన్నే వారు గమనించలేదు. దీంతో అంపైర్ల పని తీరుపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్ అంపైరింగ్ అంటూ నెటజన్లు మండిపడుతున్నారు. అంపైర్లు ఇది పట్టించుకోకపోవడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు జోకులు కూడా పేల్చుతున్నారు.