
హైదరాబాద్: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో వర్షం దోబూచులాడుతోంది. కాసేపు తెరపినిస్తూ మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఈ మ్యాచ్లో వరుణుడు రెండు సార్లు అంతరాయం కలిగించాడు.
ప్రస్తుతం వర్షం కురవడం ఆగిపోయింది. మరి కాసేపట్లో మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఓవర్ల కుదింపు విషయంలో మాత్రం అంఫైర్లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ 13:15 గంటలకు ప్రారంభయ్యే అవకాశం ఉంది.
అంతకముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు 22 ఓవర్లకు గాను 158/2 స్థితిలో ఉంది. హోప్ (19), హెట్మైయిర్ (18) పరుగులతో ఉన్నారు.
కాగా, మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల వరద పారించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ఆఖరి మ్యాచ్ కావడంతో.. కెరీర్ని ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
30 బంతుల్లోనే 6 ఫోర్లు ఐదు సిక్సులతో క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో క్రిస్ గేల్కు ఇది 54వ హాఫ్ సెంచరీ. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. 2014 తర్వాత విండీస్ బ్యాట్స్మెన్లు తొలి వికెట్కి 100కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
అయితే ఈ జోడీకి యుజవేంద్ర చాహల్ బ్రేక్ వేశాడు. చాహల్ వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి లివీస్(43) ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతికి క్రిస్ గేల్ (72; 41 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.