
హైదరాబాద్: పుణె వేదికగా వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో మూడో వన్డేలో టీమిండియా 43 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ సిరిస్లో అక్టోబర్ 29న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. యువ ఆటగాళ్లతో నిండిన వెస్టిండిస్ జట్టు భారత్కు సొంతగడ్డపైనే పెద్ద షాకిచ్చింది. తొలి వన్డేలో ఓటమిని ఎదుర్కొని.. రెండో వన్డేలో మ్యాచ్ను టైగా ముగించిన విండీస్.. మూడో వన్డేలో ఏకంగా ఆతిథ్య భారత్ను మట్టికరిపించింది.
దీంతో వెస్టిండిస్ జట్టు ఐదు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఈ సిరిస్లో మిగిలిన రెండు వన్డేలు సిరీస్ విజయానికి ఇరు జట్లకు కీలకంగా మారాయి. మూడో వన్డేలో వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.
విండీస్ ఇన్నింగ్స్లో హోప్(95) తృటిలో సెంచరీని కోల్పోయాడు. చివర్లో నర్స్(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకోవడంతో కష్టాల్లో పడింది.
ఒత్తిడిలో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరసగా మూడో వన్డేలోనూ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(107: 119 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్) సెంచరీ వృథా అయింది. శిఖర్ ధావన్(35) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో మార్లోన్ శామ్యూల్స్ మూడు, జాసన్ హోల్డర్, మెకాయ్, నర్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.