అహ్మదాబాద్: వెస్టిండీస్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ తడబడినప్పటికీ కుదురుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మకు జతగా రిషబ్ పంత్ను ఓపెనర్గా పంపిన ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రోచ్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 12వ ఓవర్లో ఓడియన్ స్మిత్ పంత్, కోహ్లీ ఇద్దరిని ఔట్ చేసి దెబ్బకొట్టాడు. 18 పరుగులు చేసిన పంత్.. హోల్డర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, 18 పరుగులు చేసిన కోహ్లీ హోప్నకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలకు చేరువయ్యారు. కానీ జట్టు స్కోర్ 134 పరుగువ వద్ద ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో అనవసరంగా మధ్యలో ఆగి రనౌటయ్యాడు. 34 ఓవర్ను రోచ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని రాహుల్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తొలి పరుగు తీసి రెండో పరుగుకు ప్రయత్నించారు. కానీ సూర్యను రెండో పరుగుకు రమ్మని పిలిచిన రాహుల్ పిచ్పై పరిగెత్తి మళ్లీ ఎందుకనో కానీ మధ్యలో ఆగాడు.
ఈ క్రమంలో సూర్య మాత్రం తన పరుగును ఆపలేదు. ఆగిన రాహుల్ మళ్లీ పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో హూసెన్ బంతిని స్టంప్స్ దగ్గర ఉన్న హోప్కు విసిరాడు. హోప్ వికెట్లను కొట్టడంతో కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. దీంతో రాహుల్, సూర్యకుమార్ 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ తన తప్పిదంతోనే అనవసరంగా రనౌట్ అయ్యాడని కామెంటేటర్లు సైతం వ్యాఖ్యానించారు. రాహుల్ మధ్యలో ఆగకపోయి ఉంటే రనౌట్ అయ్యే వాడు కాదని చెప్పుకొచ్చారు. కాగా ఈ మ్యాచ్లో మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 4 పోర్లు, 2 సిక్సులతో 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీని చేజర్జుకున్నాడు.