చెవులు మూసుకున్న రాహుల్:
విశాఖ వన్డేలో లోకేశ్ రాహుల్ సెంచరీ కంటే.. మరో ఘటనతోనే ఎక్కువగా వార్తల్లోకి ఎక్కాడు. సెంచరీ తర్వాత రాహుల్ కళ్లు మూసుకుని చెవుల పక్కన వేళ్లు పెట్టి తన సెంచరీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ చెవులు మూసుకున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రాహుల్ అలా ఎందుకు చేశాడనేదానిపై క్లారిటీ లేదు.
అతియా శెట్టి తిట్టిందా:
నెటిజన్లు ఈ ఫొటోపై ట్విటర్లో మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఓ ఆటాడుకుంటున్నారు. 'తప్పు చేశాను.. మళ్లీ కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లను', 'కరణ్ జోహార్ ,మళ్లీ కాఫీ విత్ కరణ్కు పిలిచాడనుకుంటా', 'ఎగ్జామ్లో కాపీ కొడుతుంటే టీచర్కు దొరికిపోయినట్టున్నాడు', 'రాహుల్ ప్లేస్లో ధావన్ను తీసుకోస్తామని ఎవరో చెప్పినట్టున్నారు', 'అతియా శెట్టి తిట్టిందా?' అని జోకులు పేల్చుతున్నారు.
కటక్ చేరుకున్న జట్లు:
మూడు వన్డే సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచిన భారత్-వెస్టిండీస్ జట్లు చివరిదైన మూడో మ్యాచ్ కోసం గురువారం భువనేశ్వర్కు చేరుకున్నాయి. ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో ఇరు జట్లు చివరి వన్డే ఆడనున్నాయి. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు ఆటగాళ్లు నెట్స్లో చెమటోడ్చనున్నారు. శుక్రవారం ఉదయం వెస్టిండీస్ జట్టు సాధన చేయనుండగా.. భారత్ మధ్యాహ్నం మైదానంలోకి దిగనుంది.
చాహర్ దూరం:
కీలక మూడో వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ స్టార్ పేస్ బౌలర్ దీపక్ చాహర్ కటక్ వన్డేకు దూరమయ్యాడు. విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన చాహర్.. కీలక మూడో వన్డేకు అందుబాటులో ఉండటం లేదని టీమిండియా మేనేజ్మెంట్ గురువారం స్పష్టం చేసింది. చాహర్ స్థానంలో నవదీప్ షైనీని ఎంపిక చేసినట్లు పేర్కొంది.