సహనం అవసరం:
బ్రాండన్ కింగ్, ఖారీ పెర్రీ, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, కెసెరిక్ విలియమ్స్, హైడెన్ వాల్ష్ జూనియర్ వంటి యువ ఆటగాలను విండీస్ బోర్డు టీమిండియా పర్యటన కోసం ఎంపిక చేసింది. 'బ్రాండన్, కెసెరిక్ బాగా ఆడుతున్నారు. యువకులు అందరూ విండీస్కు ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పుడే వారి ప్రదర్శనపై ఓ అంచనాకు రాకూడదు. సహనం అవసరం. మనకు ఫలితాలు ముఖ్యం' అని పొలార్డ్ అన్నాడు.
రాబందుల నుంచి రక్షించాలి:
'యువ ఆటగాళ్లపై ప్రపంచ క్రికెట్ రాబందుల ప్రభావం పడకుండా చూడాలి. వారితో అన్నిటి గురించి చర్చించాలి. యువకులకు అనుభవం అవసరం. వారికి మేం మద్దతివ్వాలి. మా అనుభవాన్ని వారితో పంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతదూరం ప్రయాణించగలరో చూడాలి' అని పొలార్డ్ పేర్కొన్నాడు.
గట్టి పోటీనిస్తాం:
'మేం భారత్లో చాలా క్రికెట్ ఆడాం. అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ ఆడాం. మా అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. మంచి క్రికెట్ ఆడతాం. బాగా సన్నద్ధమయ్యాం. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం ముఖ్యం. అయితే నవంబర్ నుంచి ఇక్కడే ఉండటం కలిసొచ్చే అంశం. ఈ సారి టీమిండియాకు గట్టిపోటీనిస్తాం. టీమిండియా టాప్ జట్టు. విజయం సాధించాలంటే బాగా కష్టపడాలి' అని పొలార్డ్ చెప్పాడు.
సీనియర్ల లోటును పూడ్చడం కష్టం:
'వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా మా క్రికెట్ను మెరుగు పరుచుకొనేందుకు శ్రమిస్తాం. క్రిస్ గేల్, సునీల్ నరైన్, ఆండ్రు రసెల్, డ్వేన్ బ్రావో వంటి సీనియర్ల లోటును పూడ్చడం కష్టం. కానీ.. జట్టుగా మేం ఆ పని చేస్తాం. ఒకరికొకరం మద్దతిచ్చుకుంటూ ముందుకు సాగుతాం. సెలక్షన్కు సీనియర్లు అందుబాటులో ఉన్నప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించాలి' అని పొలార్డ్ అన్నాడు.