
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్ది సేపట్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్స్పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్, భారత్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఎటువంటి మార్పు చేయలేదు. పంత్ నాలుగో స్థానంలో, శ్రేయాస్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. మరోవైపు విండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫ్యాబియాన్ అలెన్ స్థానంలో ఒషానే థామస్ జట్టులోకి వచ్చాడు.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేలో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని భావిస్తున్నాయి. టీ20 సిరీస్ కోల్పోయిన ఆతిథ్య వెస్టిండీస్.. కనీసం వన్డే సిరీస్ను గెలవాలనే పట్టుదలగా ఉంది. మరోవైపు వన్డే సిరీస్ను కూడా గెలిచి తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
వెస్టిండీస్ ఈ సిరీస్లో సత్తా చాటి గేల్కు ఘనంగా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్కు ఇది 300వ వన్డే కావడం విశేషం. గేల్ మరో 9 పరుగులు చేస్తే వన్డేల్లో లారా (10,405) అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడు. గేల్ ప్రస్తుతం 10,397 పరుగులతో ఉన్నాడు. వన్డే సిరీస్ తర్వాత భారత్తో టెస్టుల్లోనూ ఆడి అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని ఆశించిన గేల్కు నిరాశ ఎదురైంది. సెలక్టర్లు అతడికి టెస్టు జట్టులో అవకాశమివ్వలేదు. దీంతో ఇంకో రెండు వన్డేలతో క్రిస్ కెరీర్ ముగియనుంది.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, షై హోప్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మైర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేస్, జేసన్ హోల్డర్ (కెప్టెన్), కార్లోస్ బ్రాత్వైట్, ఒషానే థామస్, కీమర్ రోచ్, షెల్డన్ కాట్రెల్.