రవి బిష్ణోయ్పై ప్రశంసలు
తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు. రవి బిష్ణోయ్ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడని చెప్పుకొచ్చాడు. ‘‘బిష్ణోయ్ చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి, అందుకే మేము అతనిని వెంటనే జట్టులోకి తీసుకున్నాము. అతను భిన్నమైన ఆటగాడు. అతని బౌలింగ్లో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. బిష్ణోయ్కు మంచి నైపుణ్యం ఉంది. బిష్ణోయ్ ఏ దశలోనైనా బౌలింగ్ చేయగలడు. బిష్ణోయ్ ప్రదర్శనతో మా జట్టులో పోటీ పెరిగింది. బిష్ణోయ్ తన మొదటి గేమ్లో ఇచ్చిన ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాం. బిష్ణోయ్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అతన్ని మేము జట్టుకు అవసరమైన విధంగా ఉపయోగించుకుంటాం'' అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
17 డాట్ బాల్స్
కాగా కెరీర్లో అరంగేంట్ర మ్యాచ్లోనే లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెలరేగాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని బౌలింగ్లో ఏకంగా 17 డాట్ బాల్స్ ఉండడం విశేషం. తన గూగ్లీలతో ప్రత్యర్థులను ముప్ప తిప్పలు పెట్టాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రవి బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు. కాగా అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడుతున్న రవి బిష్ణోయ్కు యజుర్వేంద్ర చాహల్ క్యాప్ అందించి వెల్కమ్ చెప్పాడు. ఇక టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన 95వ ఆటగాడిగా రవి బిష్ణోయ్ నిలిచాడు
త్వరగా పూర్తి చేయాల్సింది
ఇక మ్యాచ్లోని ఇతర అంశాల గురించి కూడా రోహిత్ శర్మ స్పందించాడు. తమ బౌలింగ్ కోటాను కాస్త త్వరగా ముగించాల్సిందని చెప్పుకొచ్చాడు. అయితే మొదటి మ్యాచ్లో సాధించిన విజయం పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ను బౌలర్లు తక్కువ స్కోర్కే కట్టడి చేశారని కొనియాడాడు. ఇక శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాడిని తాము తుది జట్టులోకి తీసుకోలేకపోయామని, జట్టులో ఈ రకమైన పోటీ ఉండడం మంచే చేస్తుందని అన్నాడు. తాము ఒక అదనపు బౌలర్ కావాలనుకున్నామని, అందుకే అయ్యర్ను తుది జట్టులోకి తీసుకోలేకపోయామని వెల్లడించారు. ఇక జట్టుకు ఏం కావాలో జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసని రోహిత్ శర్మ తెలిపాడు. అందరూ తమ బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.