అనవసర పరుగు కోసం యత్నించి హెట్మెయిర్ రనౌట్
అనంతరం క్రీజులోకి వచ్చిన షిమ్రోన్ హెట్మెయిర్(10) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్గా పెవిలియన్ బాట పట్టాడు. అంబ్రిస్తో సమన్వయం లోపం కారణంగా హెట్మెయిర్ అశ్విన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఇద్దరూ ఆటగాళ్లు ఒకే ఎండ్లోకి వెళ్లిన క్రమంలో హెట్మెయిర్ను రవీంద్ర జడేజా రనౌట్ చేశాడు. 12వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో హెట్మయర్ బంతిని మిడాన్ దిశగా నెట్టి పరుగు కోసం నాన్స్ట్రైక్ ఎండ్లో ఆంబ్రిస్ని పిలిచాడు.
రవీంద్ర జడేజా మెరుపు వేగంతో
ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న రవీంద్ర జడేజా మెరుపు వేగంతో కదిలి బంతిని అందుకున్నాడు. దీంతో మళ్లీ పరుగు వద్దంటూ హెట్మయర్ వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే క్రీజు వదిలిన ఆంబ్రిస్ దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. దీంతో.. ఇద్దరూ తడబాటులో తొలుత కీపర్ వైపు పరుగెత్తారు. బ్యాట్స్మెన్స్ ఇద్దరూ ఒకే ఎండ్వైపు వెళ్లడంతో ఇద్దరి ఎవరో ఒకరు రనౌట్ అయ్యేలా కనిపించింది.
నెమ్మదిగా నడుచుకుంటూ వికెట్ల సమీపానికి
బంతిని అందుకున్న జడేజా.. బౌలర్ అశ్విన్కి బంతిని ఇవ్వకుండా.. నింపాదిగా మిడాన్ నుంచి బంతిని తీసుకుని వస్తుండటాన్ని గమనించిన హెట్మయర్ వేగంగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు పరుగెత్తాడు. అయినా సరే, కంగారుపడని జడేజా నెమ్మదిగా నడుచుకుంటూ వికెట్ల సమీపానికి చేరుకున్నాడు. ఈ సమయంలో హెట్మయర్ దాదాపు క్రీజు దగ్గరికి రాగా, ఆఖరి క్షణంలో వికెట్లపైకి గురి చూసి బంతిని విసిరాడు.
జడేజాపై మండిపడ్డ కోహ్లీ, అశ్విన్
జడేజా తీరుతో తృటిలో హెట్మయర్ రనౌట్ నుంచి తప్పించుకునేవాడే. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అశ్విన్... జడేజాపై కోపాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన అంబ్రిస్(12)ను జడేజా తన బౌలింగ్లో ఔట్ చేశాడు. దీంతో వెస్టిండిస్ జట్టు 50 పరుగులలోపే సగం వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షేన్ దోవిచ్(10)ని కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్లో పెవిలియన్కు చేర్చాడు.
ఆరు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్
విండిస్ కోల్పోయిన ఆరు వికెట్లలో మహ్మద్ షమీకి రెండు వికెట్లు లభించగా, అశ్విన్, జడేజా, కల్దీప్ యాదవ్లకు తలో వికెట్ దక్కింది. అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 649/9 వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత భారత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. రవీంద్ర జడేజా 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో తన టెస్టు కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
24వ టెస్టు సెంచరీని నమోదు చేసిన కోహ్లీ
364/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి టెస్టు తొలిరోజు యువ ఆటగాడు పృథ్వీషా (134) పరుగులతో సెంచరీ సాధించగా.... పుజారా (86) పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ.
టెస్టుల్లో జడేజా తొలి సెంచరీ
కోహ్లీ సెంచరీ చేయగా, రిషబ్ పంత్(92) చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ఆచితూచి ఆడాడు. ఆరో వికెట్కు 64 పరుగులు జోడించిననంతరం కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కుల్దీప్(12), ఉమేశ్ యాదవ్(22), మహ్మద్ షమీ(2 నాటౌట్)ల సాయంతో ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.