న్యూ ఢిల్లీ: గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టుల్లో నంబర్ వన్గా ఉన్న భారత్ సొంత గడ్డ మీద ఉత్సాహంగా బరిలో దిగనుంది. మరోవైపు వెస్టిండీస్ బలహీనంగా కనిపిస్తోంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్లో పోటీ పడనున్నాయి. కాగా.. ఇరు జట్ల మధ్య జరగనున్న ఇండోర్ వేదికగా జరగనున్న రెండో వన్డే వేదిక మారనున్నట్టు తెలుస్తోంది.
భారత్, వెస్టిండీస్ మధ్య అక్టోబరు 24న ఇండోర్లో జరగాల్సిన రెండో వన్డే వైజాగ్లోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశముంది. కాంప్లిమెంటరీ టికెట్ల రగడ ఎంతకీ తెగకపోవడంతో ఇండోర్ ఆతిథ్య హక్కులను వదులుకునేందుకు సిద్ధమైంది. బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం స్టేడియం కెపాసిటీలో 90 శాతం టికెట్లను పబ్లిక్ సేల్కు అందుబాటులో ఉంచాలి. పది శాతం సీట్లే కాంప్లిమెంటరీ టికెట్లుగా మిగులుతాయి.
హోల్కర్ స్టేడియం పూర్తి సామర్థ్యం 27 వేల సీట్లు కాగా.. ఎంపీసీఏకి 2700 టికెట్లు మాత్రమే కాంప్లిమెంటరీ టికెట్ల రూపంలో దక్కుతాయి. అదే సమయంలో తన కోటాగా స్పాన్సర్ల కోసం ఫ్రీ పాసులు ఇవ్వాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. పెవిలియన్ గ్యాలరీలో 7 వేల సీట్లే ఉన్నాయి. అందులో పది శాతం సీట్లు అంటే 700 సీట్లే. అందులో సగం బీసీసీఐకి ఇస్తే మాకు మిగిలేది 350 సీట్లు మాత్రమే. ఇది మాకు కుదరదని ఎంసీఏ జాయింట్ సెక్రటరీ తెలిపారు. దీంతో మ్యాచ్ వేదికను మార్చుకోవాలని బోర్డుకు లేఖ రాశారు.
ఐతే అంతకుమించి కావాలని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో ఒకవేళ రెండో వన్డే ఆతిథ్యం కట్టబెడితే నిర్వహించేందుకు సిద్ధమా అని బోర్డుతో పాటు సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరినట్లు.. అందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.