హైదరాబాద్: నాలుగో వన్డే ఓటమికి బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆదివారం ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీసేన 11 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. చెత్త షాట్ సెలక్షన్ వల్లే విండిస్ చేతిలో ఓటమి పాలైనట్లు తెలిపాడు. 'మా షాట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. కీలక దశలో కీలక వికెట్లు కోల్పోయాం. మ్యాచ్ అంతటా పట్టు నిలబెట్టుకోలేకపోయాం' అని కోహ్లీ అన్నాడు.

ఐదు వన్డే సిరీస్లో వెస్టిండీస్ ఇప్పటివరకు 200 పరుగుల మైలురాయిని అందుకోలేదు. అదే విధంగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో కూడా ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లకు 189 పరుగులు చేసింది. 'విండీస్ను 200 కన్నా తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగాం. మా బౌలర్లు చాలా మంచి పదర్శన చేశారు. కానీ క్రెడిట్ వెస్టిండీస్ బౌలర్లదే. మా బౌలర్లు, ఫీల్డర్లు బాగా కృషిచేసినప్పటికీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ గేమ్ను కోల్పోయాం' అని కోహ్లీ అన్నాడు.
వెస్టిండీస్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, కేస్రిక్ విలియమ్స్, దేవేంద్ర బిషూ, ఆష్లే నర్స్ అద్భుతంగా రాణించి క్రమం తప్పకుండా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చాడని, చివరి వన్డేలో విజయం సాధించి వన్డే సిరీస్ను దక్కించుకుంటామని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజా ఓటమితో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్లో భాగంగా చివరి వన్డే జులై 6న కింగ్స్టన్లో జరగనుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం టీమిండియా వెస్టిండిస్ జట్టుతో ఒక టీ20 ఆడనుంది.