
హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒంటరి పోరు (54)చేశాడు.
టెస్ట్ హోదా జట్లపై వన్డేల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం కాగా, మొత్తంగా మూడోది కావడం విశేషం. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, భువనేశ్వర్లు చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఓపెనర్ రోహిత్ శర్మ (162), మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు (100) సెంచరీలు సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (38), విరాట్ కోహ్లీ (16) పరుగులకే ఔటైనప్పటికీ రోహిత్ శర్మ, రాయుడు క్రీజులో నిలదొక్కుకుని సెంచరీల మోత మోగించారు.
తొలుత రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కొద్ది సేపటికే తెలుగు తేజం అంబటి రాయుడు కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించాడు. అయితే, రోహిత్ 162 పరుగుల వద్ద నర్స్ బౌలింగ్లో చందర్పాల్ హేమ్రాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అంబటి రాయుడు కూడా సెంచరీని నమోదు చేశాడు.
వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కాగా, 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్లో మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు ఆ తర్వాత రనౌటై పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని 23, కేదార్ జాదవ్ (16 నాటౌట్), రవీంద్ర జడేజా (7 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.
హెమరాజ్ ఆడిన బంతిని రాయుడు క్యాచ్ పట్టడంతో 20 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. అదే పరుగు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్లు విండీస్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో వెస్టిండిస్ జట్టు 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హిట్ మెయిర్(13)ను, 12వ ఓవర్లో పావెల్(1)ను, 14వ ఓవర్లో శామ్యూల్స్ (18)ను ఖలీల్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒంటరి పోరాటంతో వెస్టిండిస్ స్కోరు బోర్డు 150 పరుగుల మార్క్ని చేరుకుంది. చివర్లో కీమర్ రోచ్ను కుల్దీప్ ఔట్ చేశాడు.
విండీస్ ఆటగాళ్లలో హోల్డర్ చేసిన 54 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఖలీల్ 5 ఓవర్లలో 3 వికెట్లు తీసి 13 పరుగులిచ్చాడు. ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.