
1971 కింగ్స్టన్, జమైకా
భారత టెస్టు క్రికెట్ను ఓ మలుపు తిప్పిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో కరేబియన్లపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టు సిరిస్తో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర వెలుగులోకి వచ్చాడు. కరేబియన్ పర్యటనలో ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు ఇది. బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్నలు ఏడు వికెట్లు తీయడంతో ఆతిథ్య వెస్టిండిస్ జట్టు 214 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు దిలిప్ సర్దేశాయ్(112), గవాస్కర్(65) పరుగులతో రాణించడంతో 352 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో గవాస్కర్ 67 పరుగులతో రాణించడంతో టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది.

1997, కెన్నింగ్టన్ ఓవల్, బార్బడోస్
శివనారాయణ్ చందర్ పాల్ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండిస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 298 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం భారత తొలి ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ (92), రాహుల్ ద్రవిడ్(78) పరుగులతో రాణించడంతో టీమిండియా 319 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ త్రయం వెంకటేశ్ ప్రసాద్, అబే కురువిల్లా, దొడ్డ గణేష్లు విజృంభిచడంతో వెస్టిండిస్ జట్టుని 140 పరుగులకే ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియాను వెస్టిండిస్ బౌలర్లు ఆంబ్రోస్, ఇయాన్ బిషప్, రోస్లు 35.5 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

2002, సెయింట్ జాన్స్ స్టేడియం, ఆంటిగ్వా
ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్-విండిస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే దవడకు పెద్ద గాయమే అయింది. విండిస్ బౌలర్ మెర్విన్ దిల్లాన్ వేసిన బౌన్సర్ దెబ్బకు కుంబ్లే దవడ పగిలింది. అయినా సరే కుంబ్లే పట్టువిడవకుండా రెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లు పాటు బౌలింగ్ వేసి బ్రియాన్ లారాను పెవిలియన్కు చేర్చాడు.

2011, వాంఖడె స్టేడియం, ముంబై
ఈ మ్యాచ్లో ఆరుగురు వెస్టిండిస్ టాపార్డర్ బ్యాట్స్మెన్ 50కి పైగా పరుగులు చేయడంతో( బ్రావో 166, బారాత్ 62, బ్రాత్ వైట్ 68, ఎడ్వర్ట్స్ 86, పొలార్డ్ 81, శామ్యూల్స్ 61) తొలి ఇన్నింగ్స్లో వెస్టిండిస్ జట్టు 590 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ (103) సెంచరీ సాధించడంతో 482 పరుగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ప్రజ్ఞాన్ ఓజా(6/47), అశ్విన్ (4/34) రాణించడంతో భారత్కు కేవలం 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో విండిస్ బౌలర్లు సైతం రాణించడంతో టీమిండియా విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. రెండో పరుగు తీసే క్రమంలో అశ్విన రనౌట్ కావడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది.


Click it and Unblock the Notifications












