
పొలార్డ్ సారథ్యం అద్భుతం:
మ్యాచ్ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. 'కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు బాగుంది. విండీస్ టీ20ల్లో అసాధారణ రీతిలో ఆడుతోంది. ముఖ్యంగా పొలార్డ్ సారథ్యంలోని జట్టు చాలా పరిణితి చెందుతోంది. జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ20లు ఆడుతున్నారు. దీంతో ఈ ఫార్మట్లో వారు విశేషంగా రాణిస్తున్నారు' అని రోహిత్ పేర్కొన్నాడు.

ఈ సిరీస్ను చాలెంజింగ్గా తీసుకున్నాం:
'విండీస్ ఆటగాళ్లు ప్రతి రెండు బంతులకు ఒక సిక్సర్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. వెస్టిండీస్తో టీ20 సిరీస్ అనగానే చాలెంజింగ్గా తీసుకున్నాం. ఎందుకంటే.. ఆ జట్టులో పవర్ హిట్టర్లు చాలా మంది ఉన్నారు. ఈ సిరీస్ బౌలర్లకు పెద్ద పరీక్ష. పొట్టి ఫార్మాట్లో విండీస్ జట్టు ప్రమాదకారే అయినా.. మేం ఏ జట్టుకు భయపడం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే మేమే గెలుస్తాం' అని రోహిత్ అన్నాడు.

సిరీస్ సాధిస్తామనే నమ్మకం ఉంది:
'హైదరాబాద్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సహాయంతో టీ20ల్లో భారీ స్కోర్ను ఛేజ్ చేశాం. అయితే రెండో మ్యాచ్లో విఫలం అయ్యాం. ఆ మ్యాచ్లో అనేక పొరపాట్లు చేశాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పూర్తిగా తేలిపోయాం. ప్రత్యర్థి జట్టు ముందు భారీ స్కోర్ ఉంచలేకపోయినప్పటికీ.. పోరాడే స్కోరే సాధించాం. కానీ.. బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాం. ఈ లోపాలన్ని సరిదిద్దుకొని మూడో టీ20 కోసం బరిలోకి దిగుతాం. సిరీస్ సాధిస్తామనే నమ్మకం ఉంది' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

మెగా టోర్నీకి సమయం ఉంది:
'వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మా దృష్టంతా మూడో టీ20లో గెలుపొందడంపైనే. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధంచేస్తున్నట్లు చెప్పడం సరైంది కాదు. సిరీస్ను చేజిక్కించుకోవడంపైనే మా ఫోకస్. అదే మమ్మల్ని మంచి స్థితిలో ఉంచుతుంది. మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తూ ఉంటే.. తుది జట్టును ఎంపిక చేసుకునే అవకాశం అదే వస్తుంది' అని రోహిత్ తెలిపాడు.


Click it and Unblock the Notifications












