
హైదరాబాద్: వాంఖడె వేదికగా వెస్టిండిస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి ఓడిపోయింది.
ఛేదనలో విండీస్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్ 41, పొలార్డ్ 68 భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కాసేపు పోరాడారు. అయితే, బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత విజయం సాధించడంలో కీలకంగా వ్యవహారించారు.
తాజా విజయంతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో రెండు మ్యాచ్లు నెగ్గిన భారత్ సిరీస్ దక్కించుకుంది.
విండిస్ విజయ లక్ష్యం 241
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఫలితంగా వెస్టిండిస్ జట్టుకు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత జట్టులో రోహిత్శర్మ(71; 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్ రాహుల్(91; 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు), విరాట్ కోహ్లీ(70; 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ డకౌట్గా వెనుదిరిగాడు. చివర్లో కోహ్లీ సిక్సులతో అదరగొట్టాడు.
29 బంతులు ఆడిన కోహ్లీ.. ఏడు సిక్సులు, నాలుగు ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక, వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, విలియమ్స్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండిస్
అంతకముందు టాస్ గెలిచి వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వాంఖెడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రెండు కీలక మార్పులు చేసింది.
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ల స్థానంలో మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్లు జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్ల్లో ఫీల్డింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చిన వాషింగ్టన్ సుందర్ను కోహ్లీ పక్కకు పెడతాడని అంతా భావించారు.
అయితే, టీమ్ మేనేజ్మెంట్ అతడికి మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా విండీస్ పర్యటన సందర్భంగా కరీబియన్ జట్టును వైట్వాష్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై విజయం సాధించి విండీస్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వాంఖడె స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 6 టీ20ల్లో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఐదు సార్లు విజయం సాధించగా... ఒకసారి మాత్రమే ఓటమిపాలైంది.