
కటక్: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య బారాబతి స్టేడియంలో సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అందరూ ఊహించినట్టుగానే యువ పేసర్ నవదీప్ సైనీ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విండీస్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీగా నిలిచాయి. దీంతో కటక్ వన్డే పోరు ఇరు జట్లకు కీలకం. గెలిచిన జట్టుదే సిరీస్ కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బలాబలాలపరంగా భారత్దే పైచేయి అయినా.. ఈ పర్యటనలో విండీస్ ఆటను చూస్తే తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పదో ద్వైపాక్షిక సిరీస్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీసేన ఉంటే.. మరోవైపు 13 ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది.
బారాబతి పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ మైదానంలో వన్డే జరిగి మూడేళ్లయింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్లో ఏకంగా 747 పరుగులు నమోదయ్యాయి. మంచు ప్రభావం ఉండనుంది. మ్యాచ్కు వర్షం నుంచి ముప్పు లేదు.
తుది జట్లు:
భారత్: రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.
వెస్టిండీస్: ఎవిన్ లూయిస్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), హెట్మయెర్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, ఖారీ పైర్, కాట్రెల్.