
హైదరాబాద్: వెస్టిండిస్తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో టెస్టులోనూ విఫలమయ్యాడు. రాజ్కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో డకౌటైన కేఎల్ రాహుల్ తాజాగా నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
ఆటలో భాగంగా రెండో రోజైన శనివారం వెస్టిండిస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియా 61 పరుగుల వద్ద రాహుల్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. బంతిని టచ్ చేసి వదిలేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు.
బ్యాట్ అంచున తాకిన బంతి.. క్రీజులో పడి అనంతరం బెయిల్స్ని పడగొట్టింది. దీంతో 25 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. మరోవైపు 18 ఏళ్ల ఓపెనర్ పృథ్వీ షా (70: 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సు) మాత్రం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ ప్రదర్శనపై ట్విట్టర్లో విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
నిజానికి టెస్టు జట్టులో ఓపెనర్గా అవకాశం కోసం మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్, రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లు ఎదురుచూస్తున్న తరుణంలో పదే పదే విఫలమవుతోన్న కేఎల్ రాహుల్కి సెలక్టర్లు మళ్లీ మళ్లీ అవకాశాలిస్తుండటం అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ విశ్లేషకుల్ని సైతం విమర్శించేలా చేస్తోంది.
ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లోనూ ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో మాత్రమే సెంచరీతో ఆకట్టుకున్నాడు.