
వైజాగ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం విశాఖపట్నంలో రెండో వన్డే జరుగనుంది. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో రెండో వన్డే మ్యాచ్ రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. టీమిండియాకు కీలక మ్యాచ్ కాబట్టి రెండో వన్డేపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.
ఏసీఏ వీడీసీఏ స్టేడియం సామర్థ్యం 27 వేలు. సోమవారం సాయంత్రానికి 16 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయని స్టేడియం నిర్వాహకులు అంటున్నారు. మిగతా టిక్కెట్లు అన్ని కూడా ఈ రోజు అమ్ముడుపోయే అవకాశం ఉందట. రెండు వేలు, నాలుగు వేలు ధర కలిగిన టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాడని సమాచారం. కీలకమైన మ్యాచ్ కావడంతో స్టేడియం ఫుల్ అవుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గత అక్టోబర్లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి సెక్యురిటీని దాటుకొని.. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నారు. భారీగా పోలీసులను మోహరించనున్నారు.
స్థానిక ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వై. వేణుగోపాల్ రావు పేరిట విశాఖ స్టేడియంలో ఓ గేట్ను ఏర్పాటు చేయనున్నామని అపెక్స్ కమిటీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించిననున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి దుర్గాప్రసాద్, కోశాధికారి గోపీనాథ్ రెడ్డిలతో పాటు డీసీపీ రంగారెడ్డి, జేసీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
ఈ వన్డే కోసం భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు సోమవారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. ఈ రోజు ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి వన్డేలో విఫలమయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి బౌలింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాడు. రెండో వన్డేలో బౌలింగ్లో మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే.