గోల్డెన్ డక్
రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఎదుర్కొన్న తొలి బంతికే 'గోల్డెన్ డక్'గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. మహ్మద్ షమీ వేసిన 30 ఓవర్ రెండో బంతికి నికోలస్ పూరన్ ఔట్ కాగా.. ఆ మరుసటి బంతికి పొలార్డ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ పైకి వేసిన బాల్ను పొలార్డ్ షాట్ ఆడగా.. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు.
వన్డేల్లో ఇదే తొలిసారి
విరాట్ కోహ్లీ కూడా ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరి గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే కోహ్లీని పొలార్డ్ ఔట్ చేయడం విశేషం. 38వ ఓవర్ మూడో బంతిని పొలార్డ్ స్లో బౌన్సర్గా వేయగా.. పుల్ చేసిన కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తాను ఎదుర్కొన్న తొలిబంతికే పెవిలియన్ బాట పట్టాడు. వన్డే క్రికెట్లో కెప్టెన్లిద్దరూ ఇలా మొదటి బంతికే డకౌటవడం ఇదే తొలిసారి.
సెంచరీల మోత
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ (138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 159), కేఎల్ రాహుల్ (104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 102) సెంచరీలతో సత్తాచాటారు. శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53), రిషభ్ పంత్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39) ఆకాశమే హద్దుగా చెలరేగారు. షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు తీసాడు.
కుల్దీప్ హ్యాట్రిక్
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. షాయ్ హోప్ (85 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78), నికొలస్ పూరన్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. కీమో పాల్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 46) పర్లేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ (3/52) హ్యాట్రిక్ సాధించగా.. షమీ (3/39) మూడు, జడేజా (2/74) రెండు వికెట్లు తీశారు. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.