
కోహ్లీ ట్రాక్ రికార్డు:
చెన్నై వన్డేలో ఓడిపోవడంతో ఇప్పుడు ఒత్తిడంతా టీమిండియాపైనే ఉంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశాఖలో ఘనమైన రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం. విశాఖ అంటేనే కోహ్లీ రెచ్చిపోతాడు. వరుసగా ఐదు వన్డేల్లో మూడు సెంచరీలు.. రెండు అర్ధ సెంచరీలు బాదాడు. 118, 117, 99, 65, 157 ఇదీ విశాఖ స్టేడియంలో కోహ్లీ ట్రాక్ రికార్డు. దీంతో విశాఖ స్టేడియాన్ని కోహ్లీ తన అడ్డాగా మార్చుకున్నాడు.

ఆందోళనలో విండీస్:
మొత్తంగా ఏసీఏ-వీసీడీఏ స్టేడియంలో కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు చేసాడు. ఇందులోవిండీస్పై మూడు వన్డేలు ఆడి 186.5 సగటుతో 373 పరుగులు సాధించాడు. కీలక రెండో వన్డే మ్యాచ్లోనూ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అచ్చొచ్చిన మైదానంలో కోహ్లీ మరోసారి రెచ్చిపోతే విండీస్ బౌలర్లకు చుక్కలు కనిపించక తప్పదు. కోహ్లీ ట్రాక్ రికార్డు చూసి విండీస్ ఆందోళనలో ఉంది. కోహ్లీని త్వరగా పెవిలియన్ పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

కోహ్లీ సెంచరీ:
అక్టోబర్ 24, 2018న ఇరు జట్ల మధ్య విశాఖలో జరిగిన మ్యాచ్లోనే కోహ్లీ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే రసవత్తరంగా ముగిసిన ఈ మ్యాచ్ చివరకు టై అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా.. అంబటి రాయుడు (80 బంతుల్లో 73; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసాడు.

చివరి బంతికి ఫోర్:
లక్ష్యఛేదనలో విండీస్ దీటుగా బదులిచ్చింది. షై హోప్ (134) సెంచరీకి హెట్మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తోడవడంతో ఒక దశలో విండీస్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే వెస్టిండీస్ విజయానికి చివరి 18 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో .. 48వ ఓవర్లో చాహల్ కేవలం 2 పరుగులే ఇచ్చాడు. 49వ ఓవర్లో షమీ 6 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 14కు చేరింది. చివరి ఓవర్ వేసిన ఉమేశ్ భారీగా పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన దశలో హోప్ ఫోర్ కొట్టి మ్యాచ్ను టై చేశాడు.

బ్యాటింగ్కు స్వర్గధామం:
విశాఖ వికెట్ బ్యాటింగ్కు స్వర్గధామం. సాధారణంగా ఈ పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. మ్యాచ్కు వరుణుడి ముప్పులేదు.2010 నుంచి ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 275గా ఉంటోంది. ఇక్కడ జరిగిన చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారే గెలిచింది. ఈ స్టేడియంలో భారత్ ఆడిన ఎనమిది మ్యాచ్ల్లో 6 గెలిచి, ఒకటి ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా.. ఒక ఓటమి విండీస్ చేతిలోనే ఎదురైంది.


Click it and Unblock the Notifications












