పంత్@ 24:
రెండో వన్డేలో టీమిండియా యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. వన్డేల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన జోడీగా ఘనత సాధించారు.కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత అయ్యర్.. రోహిత్ తర్వాత పంత్ క్రీజులోకి వచ్చారు. తొలి వన్డేలో అదరగొట్టిన ఈ యువ ద్వయం విశాఖలో కూడా పూనకం వచ్చినవాళ్లలా విరుచుకుపడింది. మొదటగా షెల్డన్ కాట్రెల్ వేసిన 46వ ఓవర్లో పంత్ వరుసగా 6, 0, 4, 6, 4, 4తో మొత్తం 24 పరుగులు సాధించాడు.
ఒకే ఓవర్లో 31 పరుగులు:
ఇక మరుసటి ఓవర్లో బాదే బాధ్యత అయ్యర్ తీసుకున్నాడు. రోస్టన్ ఛేజ్ వేసిన 47వ ఓవర్ తొలి బంతిని శ్రేయస్ ఆడాడు. ఒక పరుగొచ్చింది. అయితే అది నోబాల్. ఆ తర్వాత బంతికి పంత్ సింగిల్ తీయగా.. శ్రేయస్ స్ట్రైక్కు వచ్చాడు. వరుసగా 6, 6, 4, 6, 6 బాదడంతో మైదానం మోత మోగిపోయింది. ఈ ఓవర్లో మొత్తంగా ఇద్దరూ కలిసి 31 పరుగులు చేశారు.
సచిన్-జడేజా రికార్డు బద్దలు:
వన్డేల్లో ఒక ఓవర్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు (31). దీంతో 20 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా (28 పరుగులు) నెలకొల్పిన రికార్డు బద్దలయింది. కివీస్ జట్టుపై 1999లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో సచిన్-జడేజా 28 పరుగులు చేశారు. 2000లో అగార్కర్-జహీర్ కూడా 27 పరుగులు సాధించారు. తాజాగా పంత్-శ్రేయస్ 31 పరుగులు చేసారు.
కోహ్లీ @ 400:
విశాఖ మైదానంతో ఎంతో అనుబంధం ఉన్న కోహ్లీ.. బుధవారం మ్యాచ్లో మరో మైలురాయి అందుకున్నాడు. విశాఖలో జరిగిన గత మ్యాచ్లో వన్డేల్లో అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్ల్లో) 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ.. ఈ మ్యాచ్తో మూడు ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 400వ మ్యాచ్ ఆడాడు. 2008లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన విరాట్.. ఇప్పటి వరకు 241 వన్డేలు, 84 టెస్టులు, 75 టీ20లు ఆడాడు. భారత్ తరఫున సచిన్ (664), ధోనీ (538), ద్రవిడ్ (509), అజారుద్దీన్ (433), గంగూలీ (424), కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) మాత్రమే నాలుగొందలకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు.