
విశాఖపట్నం: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించగా.. యువ బ్యాట్స్మెన్ షిమ్రోన్ హెట్మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడి అద్భుత సెంచరీ చేసాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ నెల 18 (బుధవారం)న విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఈ వన్డే కోసం భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు సోమవారం ఉదయం చెన్నై ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్కు వెళ్లానున్నారు.
సోమవారం ఆటగాళ్లు అందరూ హోటల్కు చేరుకొని విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో తేలిపోయినందున కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (88 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (69 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, జోసెఫ్ తలా 2 వికెట్లు తీశారు. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో 13 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్లో విండీస్ 1-0తో ముందంజ వేసింది.