
విశాఖ: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ నెల 18 (బుధవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ వన్డే కోసం భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు సోమవారం ఉదయం చెన్నై ఎయిర్పోర్టు నుంచి ఇండిగో విమానం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో అడగు పెట్టిన క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.
ఇరుజట్ల ఆటగాళ్లు అందరూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్కు వెళ్లారు. దారిపొడవునా అభిమానులు 'కోహ్లీ.. కోహ్లీ' అంటూ నినాదాలు చేసి స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ.. విండీస్ ఆటగాళ్లు కిరన్ పొలార్డ్, షిమ్రాన్ హెట్మయిర్, హోప్, ఆంబ్రిస్, పూరన్ తదితరులు సందడి చేశారు.
సోమవారం ఆటగాళ్లు అందరూ హోటల్కు చేరుకొని విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి. తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో తేలిపోయినందున కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రెండో వన్డేలో ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశం ఉంది.
చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (88 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (69 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, జోసెఫ్ తలా 2 వికెట్లు తీశారు. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో 13 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. షై హోప్ (151 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), హెట్మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీలు చేసారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్లో విండీస్ 1-0తో ముందంజ వేసింది.