
హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మొదటి రెండు టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఇదే ఊపులో మంగళవారం జరిగే మూడో టీ20కి సిద్ధమైంది.
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మూడో టీ20కి జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లు దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మనీష్ పాండే స్థానంలో శ్రేయాస్ అయ్యర్, నవదీప్ సైనీ స్థానంలో దీపక్ చాహర్ జట్టులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ కొనసాగనున్నారు. రిషబ్ పంత్ రెండు టీ20లలో విఫలమయినా.. కీపర్ స్థానంలో కొనసాగనున్నాడు.
మూడో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు చివరి టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని విండీస్ చూస్తోంది. హార్డ్ హిట్టర్లతో నిండిన వెస్టిండిస్ జట్టు వరుసగా రెండు టీ20లలో ఓడడం విశేషం. చివరి టీ20 మంగళవారం రాత్రి 8 గంటలకు గయనాలో జరగనుంది.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మరో మంచి గేమ్ ఆడాం. అందరూ సమిష్టిగా రాణించారు. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ సొంతమైంది. తదుపరి మ్యాచ్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. అయితే మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే. గయనాలో ఇదివరకు ఆడలేదు. ఆ మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది.
జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్.