మూడు గంటలు చెమటోడ్చిన విండీస్:
హైదరాబాద్ చేరుకోవడమే ఆలస్యం విండీస్ జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం దాదాపు మూడు గంటల పాటు కరీబియన్ ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో చెమటోడ్చారు. అందరూ బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ భారీ షాట్లు ఆడాడు. అనంతరం జట్టు సభ్యులు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు.
మరో రెండు రోజులు ప్రాక్టీస్:
బుధవారం, గురువారం కూడా ఇరు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయని హెచ్సీఏ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం విండీస్ ప్రాక్టీస్ చేస్తే.. మధ్యాహ్నం సమయంలో టీమిండియా ప్రాక్టీస్ చేయనుందట. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని సమాచారం.
వేదికలలో మార్పులు:
షెడ్యూల్ ప్రకారం సిరీస్ ముంబై మ్యాచ్తో ప్రారంభం కావాల్సి ఉన్నా.. భద్రతా కారణాల దృష్టా వేదికలలో మార్పులు చేసింది బీసీసీఐ. తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తుండగా.. డిసెంబర్ 11న చివరి మ్యాచ్ వాంఖెడేలో జరగనుంది. డిసెంబర్ 8న తిరువనంతపురంలో రెండో టీ20 జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య చెన్నై (డిసెంబర్ 15), విశాఖపట్నం (డిసెంబర్ 18), కటక్ (డిసెంబర్ 22) లలో మూడు వన్డేలు జరుగనున్నాయి.
పొలార్డ్కు సవాల్:
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా పటిష్టంగా ఉంది. మరోవైపు ఆటగాడిగా పొలార్డ్కు ఎంతో అనుభవం ఉన్నా.. కెప్టెన్సీ పరంగా పెద్దగా గుర్తింపు లేదు. అఫ్గానిస్తాన్తో ఆరు మ్యాచ్లు సహా అతను ఇప్పటి వరకు ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్లలోనే విండీస్కు నాయకత్వం వహించాడు. విండీస్కు మరో ప్రత్యామ్నాయం లేక పొలార్డ్కే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అప్పగించారు. అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలకు భారత్తో సిరీస్ ఒక సవాల్ కానుంది. దీనిని అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.