వారు తెలివిగా ఆడారు:
మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డుల కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ... 'నేనూ, రోహిత్ పరుగులు చేయలేకపోయాం. దీంతో శ్రేయస్, పంత్లకు మంచి అవకాశం లభించింది. తమ స్థానాలను సుస్థిరం చేసుకొనేలా ఆడారు. నెమ్మదైన పిచ్పై తెలివిగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్లో తేలిపోయాం. మ్యాచ్లో ఆరుగురు బౌలర్లు సరిపోతారని భావించాం. కానీ.. పిచ్పై మా అంచనాను తల క్రిందులు చేసింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అంతగా సహకరించలేదు' అని తెలిపాడు.
విండీస్ బాగా బ్యాటింగ్ చేసింది:
'విండీస్ బాగా బ్యాటింగ్ చేసింది. హెట్మెయిర్, హోప్ బాగా ఆడారు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేశారు. హెట్మెయిర్ ఇన్నింగ్స్ చిరస్మరణీయం. ఈ విజయానికి వారు అన్ని విధాలా అర్హులు. పిచ్లో మార్పు చోటు చేసుకోవడం వల్ల మేము ఓడిపోలేదు. వాళ్ల బ్యాటింగ్ ఆద్యంతం ఉండడంతోనే ఓటమి పాలయ్యాం. మా స్పిన్నర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పైచేయి సాధించారు. మేము ఇంకా 15-20 పరుగులు ఎక్కువ చేయాల్సి ఉండే' అని కోహ్లీ పేర్కొన్నాడు.
క్రికెట్లో ఇంతకుముందెన్నడూ చూడలేదు:
'ఫీల్డర్ అడిగితే అంపైర్ నాటౌట్గా ప్రకటించారు. అయితే.. టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వ్యక్తులు అంపైర్ను మళ్లీ రివ్యూ అడగమని ఫీల్డర్లకు చెప్పడం క్రికెట్లో ఎప్పుడూ చూడలేదు. క్రికెట్లో ఉన్న నియమనిబంధనలేంటో అర్థం కాలేదు. ఫీల్డ్లో జరిగే దాన్ని స్టేడియంలో కూర్చున్న అభిమానులు నిర్ణయించేలా మరో అవకాశం ఇవ్వరని ఆశిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.
హెట్మెయిర్ సెంచరీ:
ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. పంత్ (71), శ్రేయస్ (70) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కేదార్ జాదవ్ (40) రాణించాడు. అనంతరం విండీస్ 2 వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హెట్మెయిర్ (139), హోప్ (102) సెంచరీలు చేశారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.