ఆదిలోనే షాక్:
288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సునీల్ అంబ్రీస్ (9) త్వరగానే పెవిలియన్ చేరాడు. పేసర్ దీపక్ చాహర్ బౌలింగ్లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అనంతరం హెట్మయిర్ రాకతో విండీస్ ఇన్నింగ్స్ కుదురుకుంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు హోప్ అతనికి చక్కటి సహకారం అందించాడు.
హెట్మయిర్ దూకుడు:
హెట్మయిర్ దూకుడుగా ఆడుతూ 50 బంతుల్లో 50 పరుగులు చేసాడు. అనంతరం సిక్స్లు, ఫోర్లు కొడుతూ భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇదే సమయంలో హోప్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన హెట్మయిర్.. 80 బంతుల్లోనే సెంచరీ చేసాడు. 106 బంతుల్లో 139 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.
హోప్ సెంచరీ:
హెట్మయిర్ అవుట్ అయిన అనంతరం పూరన్ (29) అండతో హోప్ సెంచరీ చేసాడు. 48వ ఓవర్ నాలుగో బంతికి, ఐదో బంతికి వరుసగా రెండు ఫోర్లు కొట్టి పూరన్ మ్యాచ్ను ముగించాడు. చివరి వరకు క్రీజులో ఉండి సెంచరీ చేసుకున్న హోప్ నాటౌట్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో దీపక్ చాహర్, షమీ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో తరువాత జరగనున్న రెండు మ్యాచ్ల్లో గెలుపు కీలకం అయింది. రెండు మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ టీమిండియాకు దక్కుతుంది.
అయ్యర్, పంత్ హఫ్ సెంచరీలు:
మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టీమిండియా యువ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ (70), రిషబ్ పంత్ (71)లు హఫ్ సెంచరీలతో రాణించారు. కేదార్ జాదవ్ (40) పరుగులతో ఆకట్టుకున్నాడు. రోహిత్ (36) పర్వాలేదనిపించగా.. రాహుల్ (6), కోహ్లీ (4) నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.