
చెన్నై: నేచురల్ గేమ్ అంటూ ఏమీ లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అంటున్నాడు. వన్డే ఫార్మాట్లో తొలి హాఫ్ సెంచరీ చేయడంపై పంత్ పైవిధంగా స్పందించాడు. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో పంత్ 71 (69 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. ఎట్టకేలకు వన్డే ఫార్మాట్లో హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ యువ ఆటగాడు చివరకు సత్తాచాటాడు.
మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ మాట్లాడుతూ... 'నేచురల్ గేమ్ అంటూ ఏమీ లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం. అదే ఆటగాడు చేసేపని. జట్టు పరిస్థితిని, టీమ్ మేనేజ్మెంట్ అవసరాలను బట్టి మనం ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ను అంచనా వేసుకుంటూ ఆడితేనే సక్సెస్ వస్తుంది. ఆటగాడిగా నిరూపించుకోవడంపైనే దృష్టి సారించా. మనల్ని మనం నమ్మితేనే రాణించగలం. టీమ్ మేనేజ్మెంట్ అవసరాలకు తగ్గట్టు ఆడటమే నా లక్ష్యం' అని అన్నాడు.
'కొన్నిసార్లు అభిమానుల మద్దతు కూడా చాలా కీలకం. నేను ఎప్పుడూ భారీ వ్యక్తిగత స్కోర్లు చేయాలనుకుంటా. అయితే ప్రతిసారి అది సాధ్యం కాదు. నా గేమ్ను ఎప్పటికప్పుడూ మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతా. జట్టు కోణంలో చూస్తే నేను నా టీమ్కు ఎలా సాయపడగలను అనేదే ఆలోచిస్తా. చివరకు కొన్ని పరుగులు చేశా' అని పంత్ పేర్కొన్నాడు.
'టీమిండియా కోసం ఆడే ప్రతి ఇన్నింగ్ నాకు ముఖ్యమే. ఓ యువకుడిగా ప్రతి రోజు క్రికెట్ నేర్చుకోవడం, మెరుగుపచుకోవడం అలవాటు చేసుకున్నా. అయ్యర్తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాలనుకున్నాం. 35-40 ఓవర్లకు క్రీజులో ఉండాలని ముందే అనుకున్నాం' అని పంత్ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్తో కలిసి పంత్ 114 పరుగుల నాల్గో వికెట్ భాగస్వామ్యం నెలకొల్పాడు.
మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లను చేజార్చుకుంది. రోహిత్ శర్మ ఔట్ అనంతరం పంత్-అయ్యర్ల జోడి ఆకట్టుకుంది. ఈ ఇద్దరు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరలో జాదవ్ రాణించడంతో టీమిండియా 288 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందుంచుంది. అయితే హెట్మెయిర్ (139), షాయ్ హోప్ (102)లు సెంచరీలతో రాణించడంతో భారత్కు ఓటమి తప్పలేదు.