
బెంగళూరు: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆదివారం పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సాధించిన పంత్ ఈ క్రమంలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. అలాగే అదే మ్యాచ్లో పంత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సారి దిగ్గజ వికెట్ కీపర్లు మహేంద్రసింగ్ ధోని, ఆడమ్ గిల్ క్రిస్ట్ను సైతం రిషబ్ పంత్ అధిగమించాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి టెస్టు ఫార్మాట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పంత్ ఈ క్రమంలో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. కాగా కపిల్ దేవ్ గతంలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
అలాగే టెస్టు క్రికెట్లో మొదటి 50 ఇన్నింగ్స్ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్గా కూడా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, బ్రాడ్ హాడిన్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఉన్నారు. పంత్ తన మొదటి 50 ఇన్నింగ్స్ల్లో 42 సిక్సులు బాదాడు.
పంత్ తర్వాతి స్థానాల్లో ధోని 31 సిక్సర్లు, ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్ 31సిక్సర్లు, ఆడం గిల్క్రిస్ట్ 30 సిక్సర్లు, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ 21 సిక్సులతో ఉన్నారు. మొత్తంగా 100 సిక్సులతో ఆడమ్ గిల్ క్రిస్ట్ మొదటి స్థానంలో ఉండగా.. 79 సిక్సులతో ధోని రెండో స్థానంలో, 54 సిక్సులతో బ్రాడ్ హాడిన్ మూడో స్థానంలో ఉన్నారు.
ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. బ్యాట్, బాల్తో అదరగొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక విజయానికి 419 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే తిరిమాణేను ఎల్బీగా డకౌట్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండడంతో ఈ మ్యాచ్లో ఇండియా విజయం ఖాయమైందనే చెప్పుకోవాలి.