IND vs SL: ఆసియా కప్ 2025లో చివరి సూపర్-4 మ్యాచ్ నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు శ్రీలంక ఆటగాడు దసున్ శనక భారత జట్టును హెచ్చరిస్తూ.. భారత్ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ శ్రీలంక వెనకడుగు వేయదని అన్నారు. శ్రీలంక ప్రయాణం అనుకున్న దానికంటే ముందే ముగిసినప్పటికీ.. తమ జట్టుకు ఇంకా చాలా చేయగలిగే సామర్థ్యం ఉందని మాజీ కెప్టెన్ దసున్ శనక వెల్లడించారు. దుబాయ్లో భారత్తో జరిగే తమ చివరి సూపర్-4 మ్యాచ్కు ముందు దసున్ శనక మాట్లాడుతూ.. డిఫెండింగ్ టీ20 ఆసియా కప్ ఛాంపియన్గా తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి తమ జట్టు దృఢ నిశ్చయంతో ఉందని చెప్పారు. భారత్కు హెచ్చరిక జారీ చేస్తూ దసున్ శనక ఇలా అన్నారు. "భారత్ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ, శ్రీలంక వెనుకడుగు వేయదు. టీ20 ప్రపంచ కప్కు ముందు తమను తాము నిరూపించుకోవడానికి ఇది మాకు మంచి అవకాశం." అని శనక అన్నారు.
భారత్కు కోల్పోయేది ఏమీ లేదు..
టీమిండియా ఇప్పటికే ఫైనల్లో పాకిస్తాన్తో తలపడటం ఖాయం కావడంతో.. శ్రీలంకతో జరిగే తమ చివరి సూపర్-4 మ్యాచ్లో పాయింట్లు లేదా క్వాలిషికేషన్ గురించి భారత జట్టుకు చింత లేదు. శుక్రవారం శ్రీలంకతో జరిగే ఈ మ్యాచ్.. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కేవలం ఫలితం కోసమే కాదు.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు తమ లయ, ఆత్మవిశ్వాసం, లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఇక శ్రీలంక విషయానికొస్తే.. వారికి మిగిలింది కేవలం ఆత్మగౌరవం మాత్రమే. వరుసగా రెండు ఓటముల తర్వాత టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన చరిత్ అసలంక సేన దుబాయ్ నుంచి నిరాశతో తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదు.

చాలా మంచి జట్టు.. కానీ దురదృష్టవశాత్తు బయట ఉన్నాం..
భారత్తో మ్యాచ్కు ముందు శ్రీలంక ఆటగాడు దసున్ శనక.. భారత్ ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రత్యర్థి అని అంగీకరించారు. కానీ వెంటనే శ్రీలంక కూడా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. "మేము ఒక మంచి మ్యాచ్ ఆశిస్తున్నాం. మేము మా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. మేము ఇంకా చాలా మంచి జట్టే.. కానీ దురదృష్టవశాత్తు టోర్నమెంట్ నుంచి బయట ఉన్నాం. కానీ మా ముందు ప్రపంచ కప్ ఉంది, కాబట్టి భారత్తో ఈ పోరు ఒక మంచి మ్యాచ్ అవుతుంది. అందుకే దుబాయ్ నుండి వెళ్లే ముందు ఈ పోటీలో తమను తాము నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఉంది" అని దసున్ శనక అన్నారు.
అభిషేక్ శర్మను బహిరంగంగా మెచ్చుకున్న శనక
సూర్యకుమార్ యాదవ్ ఫామ్ సరిగా లేనప్పటికీ, అతను ఒక పెద్ద మ్యాచ్ ప్లేయర్ అని దసున్ శనక అభివర్ణించారు. దీనితో పాటు అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనను ఆయన ప్రశంసించారు. అభిషేక్ శర్మ ఐపీఎల్ నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని ఆయన అన్నారు. భారత బ్యాటింగ్ ఎక్కువగా అభిషేక్ శర్మ చుట్టూనే తిరుగుతోంది. అతను 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 248 పరుగులు చేసి టోర్నమెంట్లో అద్భుతంగా రాణించాడు. అతడితో పాటు సంజు శాంసన్ ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, శుభ్మన్ గిల్ కూడా తక్కువ పరుగులు చేశారు. కాగా కెప్టెన్ సూర్యకుమార్ నాలుగు ఇన్నింగ్స్లలో కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు.