బుమ్రాను అనుసరిస్తూ
టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగియడంతో శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మైదానంలో ఆటగాళ్ల మ్యాచ్ సన్నద్ధత గురించి మాట్టాడుకుంటున్నారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ.. బుమ్రా బౌలింగ్ను అనుసరిస్తూ మైదానంలో పరిగెత్తడం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ నవ్వుతూ ఇలా చేయగా.. అది చూసి బుమ్రాతోపాటు అక్కడున్న భారత ఆటగాళ్లంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు.
ఈ వీడియో మ్యాచ్ లైవ్లో కూడా రాగా కామెంటేటర్లతోపాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. అమ్మ కోహ్లీ! బుమ్రానే వెక్కిరిస్తున్నావా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే బుమ్రాకు బదులు కోహ్లీతో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ రోహిత్ శర్మకు సూచిస్తున్నారు.

చెలరేగిన బుమ్రా
ఇక పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో బుమ్రా సత్తా చాటాడు. బౌలింగ్ ప్రారంభించిన తొలి 3 ఓవర్లలోనే లంకకు చెందిన 2 కీలక వికెట్లు తీశాడు. కుశాల్ మెండీస్ (2), లహిరు తిరిమాణే (8)ను వరుస ఓవర్లలో ఫెమిలియన్ చేర్చాడు. దీంతో బుమ్రా దెబ్బకు ఆరంభంలోనే శ్రీలంక కష్టాల్లో పడింది. ఇక శ్రీలంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో మరోసారి విజృంభించిన బుమ్రా.. క్రీజులో కుదురుకున్న మాథ్యూస్ (43)ను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తొలి రోజు ఆటలో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

నిరాశపరిచిన కోహ్లీ
చాలా కాలంగా సెంచరీ చేయకపోవడంతో ఐపీఎల్లో తన హోంగ్రౌండైనా బెంగళూరులో విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడని అంతా భావించారు. కానీ కోహ్లీ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. 23 పరుగులు మాత్రమే చేసి ధనుంజయ డిసిల్వా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మరోసారి క్రీజులో కుదురుకున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో కోహ్లీ కోసమే భారీగా స్టేడియానికి తరలివచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే మైదానంలో నిశ్శబ్దం అలుముకుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కష్టాల్లో లంక
తొలి రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక కష్టాల్లో ఉంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ 92 పరుగులతో చెలరేగాడు. పంత్ 39, హనుమ విహారీ 31, కోహ్లీ 23, అశ్విన్ 13 పరుగులు చేశారు.


Click it and Unblock the Notifications












