
బెంగళూరు: విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపరిచాడు. ఈ సిరీస్ను కూడా సెంచరీ లేకుండానే ముగించాడు. దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ సెంచరీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు మరింత నిరీక్షణ తప్పడం లేదు. శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఎలాంటి బంతికి ఔటయ్యాడో, రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లీ అలాంటి బంతికే ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించిన విరాట్ కోహ్లీ మంచి టచ్లో ఉన్నట్టే కనిపించాడు. ఎదుర్కొన్న రెండో బంతికి రెండు పరుగులు చేయడం, ఆ కాసేపటికే బౌండరీ కూడా బాదడంతో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగుతాడని అంతా భావించారు.
కానీ శ్రీలంక స్పిన్నర్ జయ విక్రమ వేసిన 36వ ఓవర్లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో అప్పటివరకు విరాట్ కోహ్లీ నినాదాలతో మార్మోగిన చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ విరాట్ కోహ్లీ ఇదే తరహాలో ఔటయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధనుంజయ డిసిల్వా బౌలింగ్లోనూ కోహ్లీ ఇలాగే ఔటయ్యాడు. డిసిల్వా వేసిన 28వ ఓవర్లోనూ అచ్చం ఇదే తరహా బంతికి ఎల్బీడబ్ల్యూలో దొరికిపోయాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ సెంచరీ కోసం అభిమానులకు మరిన్ని ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే కోహ్లీ సెంచరీ చేయగా రెండున్నరేళ్లయింది. ఈ టెస్టు మ్యాచ్ తర్వాత రెండు నెలలపాటు ఐపీఎల్ ఉండనుంది. ఆ తర్వాత భారత జట్టు జూన్లో మళ్లీ మ్యాచ్లు ఆడనుంది. అది కూడా సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్లు కావడం గమనార్హం. జూలైలో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీకి మరిన్ని నెలలు ఆగక తప్పడం లేదు. అలాగే కోహ్లీ సెంచరీ చేసేసరికి మూడేళ్లైనా గ్యాప్ వచ్చేలా ఉంది.
కాగా శ్రీలంకతో పింక్బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్రస్తుతం పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కలిపి జట్టు అధిక్యం ఇప్పటికే 300 దాటింది. దీంతో శ్రీలంక ముందు భారత జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచడం ఖాయమైపోయింది.