
మొహాలీ: సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ఒక్క టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ ఘన విజయం సాధించింది. అలాగే ఇతర దేశీయ భాషల్లోనూ పుష్ప చిత్రం విజయం సాధించింది. ఇక ఇందులోని పాటలు సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు అనేక మంది ప్రముఖులు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. క్రికెటర్లైతే రెచ్చి పోయారనే చెప్పుకోవాలి. శ్రీవల్లి పాటకు స్టెప్పులేయడంతోపాటు తగ్గెదేలే అనే మేనరిజాన్ని ఓ రేంజులో ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం ఈ తగ్గెదేలే అనే మేనరిజం దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది.
తాజాగా పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ మేనరిజానికి టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఫిదా అయిపోయాడు. తన వందో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో జడేజా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. తగ్గెదేలే అంటూ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ చేసిన ఈ పనిని గ్రౌండ్లోని కెమెరాలు రికార్డు చేశాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కోహ్లీ తన వందో టెస్టులో ఇలా చేయడాన్ని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా రవీంద్ర జడేజా కూడా గతంలో పుష్ప డైలాగులతోపాటు తగ్గెదేలా అంటూ అల్లు అర్జున్ను ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వందో టెస్టులో విరాట్ కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. 45 పరుగులు మాత్రమే చేశాడు. రవీంద్ర జడేజా మాత్రం ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.
మొహాలీ వేదికగా జరిగిన విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్లో శ్రీలంకపై భారత ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోర్ సాధించిన టీమిండియా ఆ తర్వాత లంక బ్యాటర్లను ఎక్కువ పరుగులు చేయనీయకుండా కట్టడి చేసింది. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్లో 175 పరుగులతో చెలరేగడంతోపాటు తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.